Monday, 5 January 2026

వజ్రాల పతకం రహస్యం విజయదుర్గం చిన్న రాజ్యం. దానికి రాజు విజయవర్ధన్. ఆయన ప్రజలను దైవంలా చూస్తాడని చుట్టుపక్కల రాజ్యాలలో పేరుగాంచాడు. అయితే, ఆయన తన మంత్రులు, ఉద్యోగుల పట్ల అతి నమ్మకంతో ఉండేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. విజయదుర్గం రాజ్యంలో అరుదైన వజ్రాలు, రత్నాలతో కూడిన ఆభరణాలు, శిల్పకళలు బాగా అభివృద్ధి చెందాయి. ఒక రోజు విజయవర్ధన్ తన పట్టపురాణి శారదతో గుర్రపుబండిలో నగరవిహారానికి బయలుదేరాడు. నగర వీధులలో వెళుతూండగా, శిల్పానంద అనే ప్రఖ్యాత నగల వర్తకుడి అంగడిలో ఉన్న, వజ్రాలు పొదిగిన అద్భుతమైన పతకాలు (Locket) రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి, ఆ అంగడిలోని రెండు పతకాలు కావాలని రాజును కోరింది. రాజుగారు తన ప్రధానమంత్రిని పిలిచి, రాణిగారి కోరిక వెల్లడించి, "వెంటనే వాటి ధర చెల్లించి పతకాలను తెప్పించు," అని ఆజ్ఞాపించాడు. "అదెంత పని ప్రభూ! ఘడియలో పూర్తిచేస్తాను," అని చెప్పిన ప్రధానమంత్రి ఆ పనిని ద్రవ్యాధికారికి (Finance Minister) అప్పగించాడు. ద్రవ్యాధికారి ఆ పనిని వస్తువుల సరఫరా అధికారికి (Supply Officer) అప్పగించాడు. వస్తువుల సరఫరా అధికారి, భటులకు అప్పజెప్పారు. భటులు వెళ్ళి శిల్పానందకు విషయం వివరించారు. "మహారాణిగారికి కావాలంటే అంగడినే తరలిస్తాను," అంటూ శిల్పానంద సంతోషంగా ఆ రెండు అత్యంత ఖరీదైన పతకాలను భటులకు అందించాడు. వాటితో పాటు, భటుల భార్యలకు కూడా వెండి పట్టీలు బహుమానంగా ఇచ్చాడు. "మాకిచ్చారు బావుంది. మరి మా పైవాళ్ళ మాటేమిటి?" అన్నారు భటులు. శిల్పానంద చేసేదిలేక వస్తువుల సరఫరా అధికారికి, ద్రవ్యాధికారికి కూడా కొన్ని విలువైన వెండి ఆభరణాలు ఇచ్చిపంపాడు. ఆ రాత్రి శిల్పానందకు నిద్రపట్టలేదు. రాణీగారికి పంపిన వజ్రాల పతకాలు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర యాభై వేల బంగారు కాసులు పైమాటే. కొన్ని రోజులు డబ్బు కోసం ఎదురు చూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయంగా అధికారులను అడగడం బావుండదని, రాజుగారికి సన్నిహితుడైన ద్రవ్యాధికారికి తాను పంపిన పతకాల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా జ్ఞాపక పత్రం పంపాడు. ద్రవ్యాధికారి ఆ పత్రాన్ని వస్తువుల సరఫరా అధికారికి ఇచ్చాడు. వస్తువుల సరఫరా అధికారి భటులను పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన డబ్బు తనకు వస్తుందని ఆశతో ఎదురు చూసిన శిల్పానందకు ఆశాభంగమే కాకుండా, అవమానం కూడా కలిగింది. వస్తువుల సరఫరా అధికారి గూఢచారులు వచ్చి, శిల్పానంద అంగడిని శోధించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని, నకిలీ ఆభరణాల తయారీ జరుగుతోందని తప్పుడు నివేదిక ఇచ్చారు. అంతే! శిల్పానందను నిర్బంధించి కారాగారంలో వేశారు. శిల్పానంద భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికిలోనై విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే, తీర్థయాత్రకు వెళ్ళిన, శిల్పానంద తండ్రి రత్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన ద్రవ్యాధికారి బావమరిదిని కలుసుకుని సంగతి చెప్పాడు. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్లి, ద్రవ్యాధికారిని చూసి తన కొడుకు తరఫున క్షమాపణలు తెలియజేశాడు. తన కొడుకు వద్ద ఉన్న సంపద పిత్రార్జితమని, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి, అతన్ని బయటకు తీసుకు రాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు నెలరోజులు పట్టింది. ఆ సమయంలో శిల్పానంద వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే శిల్పానందకు నిద్ర పట్టడం లేదు. "మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను," అన్నాడు శిల్పానంద తండ్రితో. ఆ మాట వినగానే రత్నయ్య గాఢంగా నిట్టూర్చి, "నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండి, ఇన్నాళ్లు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి, గొడ్డలిదాకా తెచ్చుకున్నావు. రాణిగారికిచ్చిన పతకాల గురించి ద్రవ్యాధికారికి పత్రం పంపకుండా ఉన్నట్టయితే, డబ్బుపోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు," అన్నాడు. "యాభై వేల కాసుల సరుకు! ఎలా వదులుకోమంటావు? మనకు ఎవరిస్తారు?" అని అడిగాడు శిల్పానంద బాధగా. "యాభై వేలు కాదు, కోటి కాసులు సంపాదించి ఉండేవాడివి, కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే!" అన్నాడు తండ్రి. "అంటే, రావలసిదాన్ని అడగడమే అపరాధం అంటావా?" అని ఎదురుప్రశ్న వేశాడు శిల్పానంద. "అడగడం అపరాధం కాదు; అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు. అందుకే, ఇంత వ్యాపారనష్టం, పరువునష్టం ఎదుర్కోవలసివచ్చింది," అన్నాడు తండ్రి. "సరే, అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు? సూటిగా చెప్పు," అన్నాడు శిల్పానంద. "నువ్వు మొదటే పెద్ద పొరబాటు చేశావు. రాణిగారు కోరిన వస్తువులతో పాటు భటులకు, అధికారులకు ఇచ్చావు. అంటే, వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా? అలా కాకుండా రాణిగారు కోరిన పతకాలను నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి సమక్షంలో ఇచ్చి ఉంటే, నీకు రావలసిన మొత్తం గురించి ఆలోచించేవారు. అంతేకాక, నువ్వు లౌక్యంగా 'మహారాణికి నా పతకాలు అలంకారం, వాటిని ఉచితంగా ఇవ్వడం నా అదృష్టం' అని చెప్పి, ఆ పతకాలను బహుమతిగా ఇచ్చి ఉంటే, నీకు రావలసిన సొమ్ముతో పాటు గొప్ప ప్రచారం కూడా వచ్చి ఉండేది." "మన అంగడి ముందు 'మహారాణి శారద ధరించే ఆభరణాలు ఇక్కడ దొరుకుతాయి' అని ఒక పెద్ద ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకీ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు. అవునా?" అన్నాడు తండ్రి. "అవును, మీరన్నది ముమ్మాటికీ నిజం," అన్నది అక్కడే ఉండి మామగారి మాటలను విన్న శిల్పానంద భార్య. ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత, రత్నయ్యకు ద్రవ్యాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి ద్రవ్యాధికారిని కలుసుకున్నాడు. అప్పుడు ద్రవ్యాధికారి, "మీ కొడుకు శిల్పానందకు జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన విచారణ జరిపి, దోషులను శిక్షించి, శిల్పానందకు చెందవలసిన మొత్తానికి మూడింతలుగా చెల్లించమని ఆదేశించారు," అంటూ లక్షా యాభై వేల బంగారు కాసులు అందజేశాడు. ఆ మొత్తాన్ని చూసి శిల్పానంద, ఆయన భార్య, తండ్రి ఎంతగానో సంతోషించారు. శిల్పానంద ఇకపై వ్యాపారంలో తండ్రి నేర్పిన లౌక్యం, దూరదృష్టిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు.

No comments:

Post a Comment