Monday, 5 January 2026

రాగి నాణెం రహస్యం వైశాల్యపురం అనే నగరంలో, దౌలత్ రామ్ అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి దయ, కనికరం లేనివాడని, డబ్బు కోసం ఎంతకైనా తెగించేవాడని పేరుంది. అదే నగరంలో మాధవ్ అనే గొప్ప దాత ఉండేవాడు. మాధవ్ ఎప్పుడూ దౌలత్ రామ్ను ఉద్దేశించి, "దౌలత్ రామ్ను చూసి ఎవరూ నేర్చుకోకూడదు. అందుకే నేను వడ్డీ లేకుండా అప్పులు ఇస్తున్నాను, రహస్య దానాలు చేస్తున్నాను," అని చెప్పుకునేవాడు. మాధవ్ తన వ్యాపారంలో ఒక కోటి రూపాయలు వసూలు అయితే, నగరంలోని అనాథ శరణాలయానికి, పేద విద్యార్థులకు పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని ఊరి వారికి మాటిచ్చాడు. అయితే, మాధవ్ నిజంగా సాయం అడిగినవారికి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడని, గుట్టుగా ఉండి ఎవరికీ డబ్బిచ్చిన దాఖలాలు లేవని కొందరంటారు. మాధవ్ చిన్న సహాయాన్ని కూడా పర్వతంలా పెంచి గొప్పలు చెప్పుకుంటాడని, చాలా మంది ఆయన గురించి చాటుగా నవ్వుకునేవారు. కర్మవీర్ అనే పేద కార్మికుడు మాత్రం, ఆయన నిజంగానే పరోపకారి అని నమ్మి, తన తల్లి వైద్య ఖర్చుల కోసం అత్యవసరంగా పదివేల రూపాయలు కావాలని వెళ్ళి మాధవ్ను అడిగాడు. మాధవ్ బాధ నటించి, "మొన్న ముగ్గురికి పది లక్షల రూపాయలు గుప్తంగా దానమిచ్చాను. నిన్న ఒక వ్యాపారికి వడ్డీ లేకుండా ఇరవై లక్షలు అప్పిచ్చాను. ఈ రోజున నా దగ్గర వంద రూపాయలు కూడా లేవు. అది నీ దురదృష్టం!" అనేశాడు. గత్యంతరం లేక కర్మవీర్, దౌలత్ రామ్ దగ్గరకెళ్ళాడు. దౌలత్ రామ్ అతడికి వెంటనే డబ్బు ఇచ్చి, ఏడాదిలోగా వడ్డీతో సహా బాకీ తీర్చకపోతే కర్మవీర్, అతడి భార్య కల్పన తమ ఇద్దరూ దౌలత్ రామ్ గోదాములో వెట్టిచాకిరికి చేరాలని పత్రం రాయించుకున్నాడు. కర్మవీర్ సరేనని ఆ డబ్బుతో తల్లికి వైద్యం చేయించి, ఆ ఏడాది పంటలు పండక డబ్బు సర్దుబాటు కాలేదు. దౌలత్ రామ్ బాకీ తీర్చడానికి కర్మవీర్ మళ్ళీ మాధవ్నే డబ్బడిగాడు. మాధవ్ కాసేపాలోచించి, "ఇతరుల సాయంతో ఎన్నాళ్ళని బ్రతుకీడుస్తావు? నీ మేలు కోరి చెబుతున్నాను. దౌలత్ రామ్ వద్ద వెట్టిచాకిరికి చేరిపో. నీకూ, నీ భార్యకూ జీవితాంతం తిండికీ, గుడ్డకూ లోటుండదు," అన్నాడు. "అయ్యో! నేనూ, నా భార్యా వెట్టిచాకిరీకి సిద్ధమే. కానీ మా కొడుకు విక్రమ్ ఒప్పుకోవడం లేదు. వాడు చదువుకున్నాడు. వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, నా బాకీలన్నీ తీరుస్తానంటున్నాడు. ఈలోగా మీ సాయం కావాలి," అన్నాడు కర్మవీర్. "అయితే, నువ్వు విక్రమ్ను నా కప్పచెప్పి దౌలత్ రామ్ దగ్గర చేరు. వాణ్ణి గొప్పవాణ్ణి చేసి వాడి చేతే నీకు వెట్టిచాకిరీ తప్పిస్తాను. అప్పుడు ఊరంతా నీ పౌరుషాన్ని, నా ఔన్నత్యాన్ని మెచ్చుకుంటారు. ఇలా ఇప్పటికి పది కుటుంబాలకు సాయపడ్డాను. నీది పదకొండోది," అన్నాడు మాధవ్. కర్మవీర్, విక్రమ్ను మాధవ్ వద్ద వదిలి, భార్యతో పాటు దౌలత్ రామ్ వద్ద వెట్టిచాకిరీకి చేరాడు. అప్పుడు విక్రమ్, మాధవ్ను వ్యాపారంలో పెట్టుబడికి లక్ష రూపాయలు ఇప్పించమని కోరాడు. "లక్షేం కర్మ! పది కోట్లు ఇస్తాను. కానీ ఒకర్నడిగి తెచ్చే పెట్టుబడితో, ఏ వ్యాపారమూ రాణించదు. నీ తెలివితేటలే పెట్టుబడి కావాలి. ఒకప్పుడు నేను రామదాస్, శ్యామలాల్, గౌతమ్ అనే ముగ్గురు పేదవాళ్ళను చేరదీసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. వ్యాపారం చేసుకోమని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అప్పిచ్చాను. వాళ్ళు ఏడాది తిరక్కుండా వెనక్కొచ్చి, నేనిచ్చినదంతా నష్టపోయామని చెప్పి, మళ్ళీ డబ్బడిగారు. నేనివ్వనంటే, పక్క పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసి కోట్లు గడించారు. ఈనాటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు," అన్నాడు మాధవ్. ఆ మాటలకు విక్రమ్ చిన్నబుచ్చుకుని, "తమరీ కథ నాకెందుకు చెప్పారో కానీ, నేనలాంటివాణ్ణికాను. నాకిచ్చిన డబ్బును వడ్డీతో కలిపి పువ్వుల్లో పెట్టి వెనక్కివ్వగలను," అన్నాడు. మాధవ్ చిరునవ్వు నవ్వి, "నాకు వడ్డీ లెందుకూ? డబ్బు తిరిగొస్తే వేరెవరికైనా సాయపడొచ్చని, నా ఆశ. కాబట్టి నువ్వు పక్క పట్టణం వెళ్ళి, ఆ ముగ్గురినీ కలుసుకో. నీ తెలివంతా ఉపయోగించి వసూలు చేయగలిగినంత తీసుకో. అదే పెట్టుబడిగా వ్యాపారం మొదలు పెట్టు. బాగు పడ్డాక నా డబ్బు నాకిచ్చేయ్," అన్నాడు. విక్రమ్ పక్క పట్టణం వెళ్ళాడు. ముందుగా గౌతమ్ను కలిసి జరిగింది చెప్పాడు. గౌతమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. "మాధవ్, ఒక రాగి నాణెం సాయం చేసి, లక్షల రూపాయల సాయం చేసినట్లు ప్రచారం చేస్తాడు. నిజానికాయన నాకూ, రామదాస్కూ, శ్యామలాల్కూ ఇచ్చిందెంతో తెలుసా? ఒక్కొక్కరికి మూడేసి రాగి నాణేలు! మొదటి నాణెం చదువుకు, రెండోది పెళ్ళికి, మూడోది వ్యాపారానికి! ఆయన మాటలు నమ్మి నా దగ్గరకొచ్చిన నిన్ను చూస్తే జాలేస్తున్నది," అన్నాడు. దానికి విక్రమ్, "నేను డబ్బు వసూలుకు మీ వద్దకు రాలేదు. ఆ మాధవ్ మాటలు నమ్మి మా నాన్న వెట్టిచాకిరి పాలయ్యాడు. ఆయన మాటలెంత నమ్మదగినవో మిమ్మల్నడిగి తెలుసుకుని, ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనే వచ్చాను," అన్నాడు. గౌతమ్, "నువ్వాయనకు బుద్ధి చెబుతానంటే, నిన్ను నా వ్యాపారంలో భాగస్వామిని చేయగలను. అయితే, అందుకు నువ్వు వారం రోజుల్లోగా, నీ తల్లిదండ్రులకు వెట్టిచాకిరి తప్పించి, నీ తెలివి నిరూపించుకోవాలి," అన్నాడు. తర్వాత విక్రమ్, శ్యామలాల్ను కలుసుకుని జరిగింది చెప్పాడు. శ్యామలాల్ వచ్చే కోపాన్నణుచుకుని, "మాధవ్కు బుద్ధి చెబుతానంటే, నేను నీ తల్లిదండ్రులకు వెట్టిచాకిరి తప్పించగలను. అందుకు నువ్వు వారం రోజుల్లో, ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని, నీ తెలివి నిరూపించుకోవాలి," అన్నాడు. చివరగా విక్రమ్, రామదాస్ను కలుసుకుని అంతా చెప్పాడు. భార్య పోతే వృద్ధాప్యంలో రెండో పెళ్ళి చేసుకున్నాడాయన. పెళ్ళీడుకొచ్చిన కూతురు, సవతి తల్లి అయిందానికీ, కానిదానికీ ప్రతిరోజూ గొడవ పడుతూంటే, ఆయనకు ఇల్లు నరకమైంది. యోగ్యుడిలా కనబడిన విక్రమ్కు, తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తోచి, "నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు వారం రోజుల్లో మాధవ్కు బుద్ధి చెప్పి, నీ తెలివి నిరూపించుకోవాలి," అని షరతు పెట్టాడు. కాసేపాలోచించగా విక్రమ్కో ఉపాయం తట్టింది. రామదాస్కు చెబితే ఆయన ఎంతో సంతోషించి, అతడికి ముప్ఫై రాగి నాణేలు ఇచ్చాడు. విక్రమ్ తిరిగి వైశాల్యపురం వెళ్ళి, మాధవ్ను కలుసుకుని, "రామదాస్, శ్యామలాల్, గౌతమ్ మీ నుంచి ఒక్కొక్కరు మూడేసి రాగి నాణేలు మాత్రమే తీసుకున్నారట. వడ్డీతో సహా బాకీ తీర్చేస్తామని బలవంతంగా ముగ్గురూ కలిసి, ఈ ముప్ఫై రాగి నాణేలూ నాకిచ్చి పంపారు. మీరు తీసుకోకపోతే, ఈ ఊరొచ్చి రభస చేస్తారట!" అంటూ ఆయన చేతిలో ముప్ఫై రాగి నాణేలూ ఉంచాడు. రామదాస్, శ్యామలాల్, గౌతమ్ నిజంగానే ఇక్కడికొచ్చి రభస చేస్తారని భయపడ్డ మాధవ్ ఒక క్షణం తటపటాయించి, "సరేలే! ఈ మాట ఇంకెవ్వరితో అనకు," అని ఆ డబ్బు తీసుకున్నాడు. "మీరు నాకు ఆదర్శం! ఎవరికేం చెప్పినా, మీకులాగే చెబుతాను," అన్నాడు విక్రమ్. అందుకు మాధవ్ సంతోషించగా, విక్రమ్ ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తర్వాత విక్రమ్ ఊళ్ళో కొందరు ముఖ్యులను కలుసుకుని, "మాధవ్గారు గోరంతలు కొండంతలు చేస్తారన్నది అబద్ధం. ఆయన నిజంగానే ఎవరికో ముప్ఫై లక్షల రూపాయలు అప్పిచ్చి నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాడు. నేనా బాకీని ముక్కుపిండి వసూలు చేస్తే, వడ్డీతో సహా ఐదు కోట్లు వచ్చింది. అందుకు సంతోషించి ఆయన నాన్నను వెట్టిచాకిరీ నుంచి తప్పించి, నాకు ఉద్యోగం వేయించి, పెళ్లి చేయిస్తానని మాటిచ్చాడు. నేనిక జీవితంలో స్థిరపడినట్టే!" అని చెప్పాడు. ఈ వార్త ఊరంతా పాకి మాధవ్నూ చేరింది. ఆయన కంగారుపడి విక్రమ్ను పిలిచి, "నువ్వు నాకిచ్చింది ముప్ఫై రాగి నాణేలు. ఊళ్ళో ఐదు కోట్లు అని చెప్పావు. నేను నీకే ఉపకారం చేస్తాననలేదు. చేస్తానన్నట్లు ఊళ్ళో చెప్పావు. అంతా దానధర్మాలంటూ వెంటబడి నన్ను దోచాలని, నీ ఆలోచనైతే అది సాగనివ్వను. నీ అబద్ధాల గురించి ఊళ్ళో చెప్పేస్తాను," అంటూ బెదిరించాడు. అందుకు విక్రమ్ వినయంగా, "ఎవరికేం చెప్పినా మీకులాగే చెబుతానని ముందే మీతో అన్నాను. అప్పుడు మీరు సంతోషించారు కూడా. తమరు రామదాస్, శ్యామలాల్, గౌతమ్లకు మూడేసి రాగి నాణేలు ఇచ్చి లక్ష రూపాయలు అన్నారు. అంటే ముప్ఫై రాగి నాణేలు ఐదు కోట్లు కదా! గోరంతలు కొండంతలు చేయడం తమ పద్ధతే కదా; మెచ్చుకుంటారనుకున్నాను. నచ్చకపోతే, నావి అబద్ధాలని ఊళ్ళో చెప్పేయండి. నేనేమీ అనుకోను," అన్నాడు. విక్రమ్ చెప్పింది అబద్ధమంటే బయట పడేది తన బండారమే అని గ్రహించిన మాధవ్ తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు. అంతేకాదు. గతంలో మాటిచ్చిన ప్రకారం ఊళ్ళో అనాథ శరణాలయానికి, విద్యార్థులకు పది లక్షల రూపాయల విరాళమిచ్చాడు. "బుద్ధొచ్చింది. ఇక ఈ జన్మలో గోరంతలు కొండంతలు చేసి గొప్పలు చెప్పుకోను," అని మనసులో అనుకున్నాడు. ఈలోగా రామదాస్, శ్యామలాల్, గౌతమ్ వైశాల్యపురం వచ్చారు. మాధవ్కు తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. ఆ తర్వాత గౌతమ్, విక్రమ్కు తన వ్యాపారంలో భాగమిచ్చాడు. శ్యామలాల్, దౌలత్ రామ్ అప్పు తీర్చి కర్మవీర్ దంపతులకు వెట్టిచాకిరి తప్పించాడు. రామదాస్ అతడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. విక్రమ్ పక్క పట్టణానికి మకాం మార్చే ముందు వైశాల్యపురంలో గొప్ప విందు ఏర్పాటు చేసి, "ఈ రోజు నా జాతకం ఇలా మారిపోవడానికి మాధవ్గారే కారణం!" అని ఊరి పెద్దలకు చెప్పాడు. "ఒరేయ్, గోరంతలు కొండంతలు చేయకు! అది మంచి అలవాటు కాదు," అన్నాడు మాధవ్ కంగారుగా.

No comments:

Post a Comment