Monday, 5 January 2026

మంచి చోటు రఘునందన్ తండ్రి వ్యాపారరీత్యా పెద్ద నగరంలో ఉండేవాడు. ఆయన తన స్వగ్రామం విడిచి, కట్టుబట్టలతో నగరానికి వచ్చాడు. అక్కడ చిన్న పనివాడిగా జీవితం ప్రారంభించి, వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని, కొన్నేళ్ళలోనే బాగా ధనం సంపాదించాడు. ఆయన రఘునందన్కు బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వడమే కాక, పోయేటప్పుడు, "నాయనా, రఘునందన్, నేను పోయాక నువ్వు ఈ నగరంలో ఉండవద్దు. ఏదైనా 'మంచి' చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది, నువ్వూ, నీ పిల్లలూ కష్టపడకుండా తినగలిగినంత ఉంది," అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక రఘునందన్కు ఎక్కడ స్థిరపడాలన్నది సమస్యగా మారింది. సొంత ఊరిలో వాణ్ణి ఆదరించే వారు చాలామంది ఉన్నారు. అయితే, ఆ ఊరు వాతావరణం ఆట్టే మంచిది కాదు. ఎప్పుడూ వేడి, నీటి సౌకర్యం సరిగా ఉండదు. అంతా బంజరు భూమి. రఘునందన్ ఆస్తిని వజ్రాలు, నగదుగా మార్చుకుని, మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడికొక చక్కని ప్రదేశం నచ్చింది. అది దట్టమైన అడవులతో, చల్లని కొండకోనల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరు! ఎటు చూసినా చందనం, దేవదారు వనాలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం రఘునందన్ను ఎంతగానో ఆకర్షించింది. వాడు ఒక కొండ గుడిసెలో స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక కొండపైకి వెళ్ళి, ఆ వాతావరణాన్ని ఆస్వాదించేవాడు. ఆ పల్లెటూళ్ళో ప్రజలందరి ముఖ్యవృత్తి అడవి ఉత్పత్తులు సేకరించడం. వాళ్ళకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే, ఈ కొత్తగా వచ్చిన రఘునందన్ను చూస్తే అసూయగా ఉండేది. ఒక్కరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఒక రోజు ఎండవేళ రఘునందన్, గుడిసె ముందున్న చందనపు చెట్టు కింద చాప వేసుకుని పడుకున్నాడు. ఎవరో పిలిచినట్టయి, మెలుకువ వచ్చింది. చాప దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి నల్ల గడ్డమూ, ఒత్తైన జుట్టూ – వాడు మాసిన కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు. వాడి మెడలో ఎండిన రుద్రాక్ష దండ ఉంది. వాడి కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి. వాడు, "కుర్రాడా, కుండ నిండా జలపాతం నీళ్లు తీసుకురా! దప్పికగా ఉంది. ఈ వేడి మాడ్చేస్తోంది," అన్నాడు రఘునందన్తో. రఘునందన్ నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు. "ఆగు, కుర్రాడా! కొండ తేనెలో, అడవి పండ్ల రసం కలిపి పట్టుకురా! నా నోరు పిడచగట్టుకు పోయింది," అన్నాడా మనిషి. రఘునందన్, "అలాగే," అని వెళ్ళబోయాడు. "దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా కలిపి పట్టుకొస్తే, రుచిగా ఉంటుంది," అని కేకపెట్టాడా గడ్డపు మనిషి. రఘునందన్ ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో కొండ తేనె, పండ్ల రసం, కుంకుమ పువ్వు కలిపిన పానీయం పట్టుకొచ్చాడు. ఆపాటికి, ఆ మనిషి, రఘునందన్ చాప మీద దర్జాగా కూర్చుని ఉన్నాడు. వాడు గుటగుట పానీయం తాగేసి, "గిన్నె చాలా విలువైనది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా!" అన్నాడు. రఘునందన్ గిన్నె లోపల పెట్టి వచ్చే సరికి, ఆ మనిషి చాప మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. "మంచి విశ్రాంతి వేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది. ఒక కునుకు తీసి లేస్తాను," అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. రఘునందన్ ఏమీ అనలేక పోయాడు. వాడు గుడిసె అరుగు మీద కూర్చుని, సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, "అప్పుడే చీకటి పడిపోయింది. ఒంటరి జీవితమై పోయింది. గుడిసెలో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు," అంటూ తిన్నగా గుడిసెలోకి వెళ్ళి, గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు రఘునందన్కు చిరాకు వేసింది. "బాగా చీకటి పడిపోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు," అని కోపాన్ని దిగిమింగుతూ అన్నాడు. ఆ మనిషి రఘునందన్ను ఎగాదిగా చూసి, "ఎవడివయ్యా, నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా? వెళ్ళు, వెళ్ళు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెల్సిందా?" అంటూ రఘునందన్ను అవతలకు నెట్టి, తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా రఘునందన్, తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, "నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బు లిచ్చుకోవాలి," అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు అడవి ఉత్పత్తుల వేటకు బయలుదేరారు. రఘునందన్ వాళ్ళందరినీ కేకవేసి పిలిచి, "ఈ అన్యాయం చూడండి," అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, "వాడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు. నా కొండ గుడిసెను పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ!" అన్నాడు. రఘునందన్కు ఆవేశం వచ్చి, "మీరే చెప్పండి. ఈ ఇల్లు నాదా, వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటంలేదూ? ఈ దొంగ మనిషికి బుద్ధి చెప్పండి," అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా రఘునందన్ను కింద నుంచి పైదాకా తేరిపార చూసి, "ఎవడవిరా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ యోగీశ్వరుడిదే! మేం రోజూ ఇతన్నే చూస్తున్నాం. మర్యాదగా నీ దారిన నువ్వుపో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం!" అని రఘునందన్ను దబాయించారు. రఘునందన్ నిర్ఘాంత పోయాడు. ఊరి వారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు రెండు సార్లు గట్టిగా తల విదిలించి, వెర్రి చూపులు చూస్తూ, "మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళూ ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే, నేను తామరపువ్వు పీఠం కింద దాచిన వజ్రాలు కూడా నాది కాదా?" అని అమాయకంగా వాళ్ళను అడిగాడు. వాళ్ళు రఘునందన్ మతి కోల్పోయాడని రూఢి పరుచుకుని, "నీది కాదు. ఆ వజ్రాలు అంతా మాది. అవి ఎక్కడ దాచావో త్వరగా చెప్పు!" అంటూ ఆత్రుతగా వాణ్ణి అడిగారు. రఘునందన్ దూరంగా ఉన్న ఎత్తయిన కొండ అంచును చూపించి, "అక్కడి కమలం ఆకారంలో ఉన్న పీఠం కిందే ఆ పెట్టెడు వజ్రాలు ఉన్నాయి," అన్నాడు. అంతా ఎవరికి వారే కాలిసత్తువ కొద్దీ ఆ వైపుకు పరుగు తీశారు. ఆ వజ్రాలు ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డపు మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తి పోగానే, రఘునందన్ తేలిగ్గా నిట్టూర్చి, గుడిసె వెనక దేవదారు చెట్టు మొదట్లో పాతిపెట్టిన వజ్రాలు ఉన్న పెట్టెను తీసుకుని, అప్పటికప్పుడు కొండ మార్గం గుండా బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. "మంచి చోటు" అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని రఘునందన్ తెలుసుకుని, తమ సొంత ఊరు వెళ్లిపోయి, తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు.

No comments:

Post a Comment