Monday, 5 January 2026

దెయ్యాలతో పోరాటం మాధవ్ అనే కవి చాలా పేదవాడు. ఎంత కష్టపడినా (కవితలు రాసినా, పాటలు పాడినా) పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏ రోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు కనీసం చిరుతిండి కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతడి భార్య అంజలి, "పుట్టింట ఎంతో గారాబంగా, ఎలాంటి కొరతా లేకుండా పెరిగిన నేను, ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవడంవల్ల తిండికీ, బట్టకూ కూడా కరువై పోయింది కదా," అని వాపోయేది. ఒకనాటి సాయంకాలం మాధవ్ ఒక్క కవిత కూడా అమ్ముడుపోక, వట్టి చేతులతో ఇంటికి తిరిగివచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువ జామునే లేచి, స్నానం చేసి, తాను రాసిన పుస్తకాలు, పాత రాతప్రతులు, కలం, దండెం (కంఠ స్వరాన్ని పెంచే చిన్న లోహపు పరికరం) ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేక వేసి పిలిచి, "కావలసినంత డబ్బు సంపాదించిన తర్వాతే తిరిగి వస్తాను," అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. మాధవ్ పట్నం కేసి వేగంగా నడవసాగాడు. బాగా అలిసిపోయినప్పుడు కొండల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ; అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అటువైపు వచ్చే బాటసారులెవరైనా కొత్త కవితలు రాయమని అడిగితే బావుణ్ణుకదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే, ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూండగా బాగా అలిసిపోయి ఒక ఎత్తయిన రావి చెట్టు కింద పడుకుని అలాగే నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది. మాధవ్ గురక విని, మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందికి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించి, వాడి భుజాలు పట్టుకుని ఊపింది. మాధవ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, "నిన్ను నేను మింగేస్తాను, మానవా!" అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ. బాగా అలిసిపోయి నిద్రమత్తులో ఉన్న మాధవ్ తను ఎలా చచ్చినా ఫరవాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగనీ అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, "పాపం అంజలి నేను లేకపోతే ఎలా బతుకుతుంది? కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి," అనుకుని, "ఏమిటీ చిలిపి చేష్ట?" అంటూ, "వెళ్ళిపో!" అన్నట్టు చేయి ఊపాడు. అయితే దయ్యం అక్కడి నుంచి కదలలేదు. "నేను కిందటిసారి పట్టుకున్న భయంకరమైన దెయ్యాన్ని చూడాలనుకుంటున్నావా?" అంటూ మాధవ్, తలకింద పెట్టుకున్న పెట్టెను తెరిచి, అందులోంచి చిన్న చేతి అద్దాన్ని వెలికి తీసి, "దీనిలోకి చూడు," అంటూ దాని ముందు ఉంచి, "ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి," అన్నాడు. అద్దంలో తన మొహం చూసి, దయ్యం హడలి పోయి కీచుమంటూ అరిచింది. "అయ్యో, ఆ భయంకరమైన దయ్యంతో కలిపి, నన్ను కూడా పెట్టెలో బంధించకు!" అంటూ మాధవ్ చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమలాడసాగింది. "అలా అయితే, నువ్వు తెల్లవారే సరికి నాకు బంగారు కాసులు తెచ్చి ఇవ్వాలి! సరేనా?" అని గద్దించాడు మాధవ్ దృఢమైన కంఠ స్వరంతో. మరు క్షణమే దయ్యం మాయమై పోయింది. మాధవ్ అద్దాన్ని పెట్టెలో పెట్టి, కోడికూత వినిపించేంతవరకు కాచుక్కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే, మరికొంత సేపటికల్లా దయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దయ్యం ఒక చిన్న మూటను తెచ్చి మాధవ్ ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే బంగారు కాసులు కనిపించాయి. "సరే, ఇప్పటికి నిన్ను వదిలి పెడుతున్నాను. పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగివస్తాను," అంటూ మాధవ్ అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని కాసులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, తన వద్ద ఉన్న బంగారు కాసులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని, కొంత మొత్తం తీసుకుని, భోజనం చేసి, పట్నంలో ఖాళీగా ఉన్న ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలా సేపు ఆదమరచి నిద్రపోయాడు. పొద్దువాలుతూండగా లేచి, ఉత్సాహంగా దయ్యం ఉన్న చెట్టు కేసి నడిచి, చీకటి పడుతూండగా అక్కడికి చేరుకున్నాడు. తన పెట్టెను తలకడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడేగాని, ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దయ్యం, దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యం స్నేహితుడితో రాత్రి జరిగినదంతా చెప్పింది. రెండు దెయ్యాలు కలిసి, మాధవ్కు ఇచ్చిన బంగారాన్ని తిరిగి రాబట్టుకోవాలనీ, తమలాంటి భయంకర దెయ్యాలను దాచి పెట్టిన పెట్టెను దొంగిలించాలనీ పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో రెండు దెయ్యాలూ చెట్టు దిగి వచ్చి, మాధవ్ నిద్రపోతున్నాడా, లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తలకింది పెట్టెను ఎత్తుకెళ్ళడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి. మాధవ్ మేలుకునే ఉన్నప్పటికీ, నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దెయ్యాలు రెండూ కలిసి, అతడి తలకింది సంచీని మెల్లగా లాగాయి. కొంత లాగేంతవరకు, కదలకుండా ఉన్న మాధవ్, మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి, పెట్టె తెరిచి అందులోని దండెన్నీ, అద్దాన్నీ వెలుపలికి తీశాడు. ఒక చేతిలో దండెన్నీ, రెండవ చేతిలో అద్దాన్నీ పట్టుకున్నాడు. దండెన్ని రెండు దెయ్యాల కేసీ గురిచేసి, నోటితో కంఠ స్వరాన్ని పెంచి వింత శబ్దాన్ని పుట్టించ సాగాడు. అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దెయ్యాలు శబ్దానికి భయపడ్డాయో, అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదుగాని, రెండూ వేగంగా కదలడం చూడడంతో దెయ్యాలు రెండూ హడలిపోయి, చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన మాధవ్, "కదలకండి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి, మరెక్కువ బంగారు నాణాలు నాకు తెచ్చి ఇవ్వాలి. తెల్లవారే సరికి రాక పోయారో, రెండో దెయ్యం ఆ పెట్టెలోని భయానక ప్రాణులతో కలిసిపోక తప్పదు!" అని హెచ్చరించాడు. ఇప్పుడు పరిగెత్తడం రెండవ దయ్యం వంతయింది. మాధవ్ లోలోపల నవ్వుకున్నాడు. అయితే, చేతుల్లోని దండెన్నీ, అద్దాన్నీ కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యం దీనంగా నిలబడుకుని, తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయం భయంగా ఎదురుచూడ సాగింది. రెండవ దయ్యం తెల్లవారు జామున వచ్చి, తనతో తెచ్చిన పెద్ద బంగారు నాణాల సంచీని మాధవ్కు ఇచ్చింది. అతడు దానిని వెంటనే తన సంచీలో పెట్టుకుని, చేతిలోని దండెన్ని అదే వేగంతో కదిలిస్తూ, "ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది. నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే, ఆ సంచీలోని ప్రాణులను వదిలి పెడతాను," అన్నాడు. ఆ తర్వాత దండెన్ని, అద్దాన్ని సంచీలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య అంజలికి తన రెండు రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని, అమితాశ్చర్యం చెందిన అతడి భార్య, "నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైనవాడివి!" అని మెచ్చుకున్నది. "నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను," అన్నాడు అప్పటికే పేదరికం నుంచి బయటపడిన మాధవ్ ఎంతో సంతోషంగా.

No comments:

Post a Comment