Friday 21 September 2012


మురళి// పందెం//
    అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేదట. ఆమెకు ఏడుగురు కొడుకులు ఒక కూతురూ ఉన్నారట. ఒక రోజు పెద్దమ్మకు ఒంట్లో బాగోపోతే కూతుర్ని పూలు కోసుకు రమ్మని అడవికి పంపిందట. అడవిలో ఒక ఎలుగుబంటి ఆమెను ఎత్తుకు పోయిందట. విషయం తెలిసి పెద్దమ్మ తన కొడుకులకు చెబితే వారు ఏడు తులసి మొక్కలు నాటి ఇవిగాని చనిపోతే మాగురించి చూడక్కరలేదు. ఒకవేళ ఓడిపోతే మాకేదొ ఆపద వాటిల్లినట్లుగా,బివి బతికేవుంటే చెల్లిని క్షేమంగా తీసుకువస్తామని ఆనిక పెట్టి ఎలుగుబంటి జాడ కనుగొనేందుకు బయలుదేరారు.
        దారిలో ఒక చెరుకుల బండి కనిపించింది. బండి అతను "మీరెక్కడికి వెలుతున్నారు" అని అడిగితే "మేము ఎలుగుబంటిని చంపడానికి వెలుతున్నాం " అన్నారు. "మీరు అంతటి వీరులైతే నేను పలకర్ర చెసి వచ్చేలోగా బండెడు చెరుకులను తినీయాలి"అని చెప్పి బండి అతను వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి ఒక్క బొద్దు కూడా తినలేక పోయారు."ఓరెళ్ళర్రా ఎలుగుబంటిని సంపెత్తారట" మొదటి దానికి మోగుడు లేకపోతే కడదానికి కళ్యాణమాట" అని అనుకొని తన దారిని తాను పోయాడట.
         అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక బెల్లపుకుండల బండి ఎదురైందట."ఓయ్ బండి నాయుడూ నీకుగాని ఎలుగుబంటి కనిపించిందా?" అని పెద్దమ్మ కొడుకులు అడిగారు.అతను  "లేదు, ఆబంటి ఊసు మీకెందుకు?" అన్నాడు. దాన్ని సంపీసి మాచెల్లెల్ని విడిపించుకు వస్తాము" అన్నారు వీరు. అప్పుడు బండి అతను "అంతపాటి ఈరాది ఈరులైతే నేను మొకం కడుక్కోనొచ్చేసరికి గాని మీరు బండెడు బెల్లం తినేస్తే అప్పుడు ఒప్పుకుంటాను" అని చెప్పి వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి వీరు ఇంకా ఒక్క కుండనే బక్కురుతున్నారు."ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికెగిరిందట" అంటూ తన దారిని పోయాడట బండివాడు.
ఇంకాస్తా దూరం వెళ్ళేసరికి ఒక చుట్టలబండి కనిపించిదట."ఓరయ్యల్లారా ఇటెటెల్తన్నారు అటు గనెళ్తే మిమ్మల్ని ఎలుగుబంటి నంచుకుంతాది" అన్నాడు బండివాడు.అప్పుడు వీరు" ఓహో! ఎలుగుబంటినెతుక్కుంటూ మేము వెళ్తున్నాం" అన్నారు." ఓసోస్ అంతపాటోలోనేటి? అయితే నేను పకాలి(10 గంటలకు తినే గంజి అన్నం)తినేసి వచ్చేసరికి బండెడు సుట్టలూ మీరు కాల్చియ్యాల" అని వెళ్ళాడు.వాడు పకాలి తినేసి వచ్చేసరికి ఒక్క చుట్టల కట్ట కూడా కాల్చలేకపోయారు." ఓరె సాలుసాలెళ్ళర్రా ఉడతూపులకి సింతకాయల్రాల్తాయా"అంటూ వెళ్ళిపోయాడు.
అలా వెల్తుంటే దారిలో ఒక ఊబి(బురద మడుగు) ఉన్నాదట. ఊబిలో ఒక ఎడ్ల బండి దిగబడిపోయిందట.ఎవరెంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు లాగలేక పోయారు. వీళ్ళు అందరినీ పక్కకెల్లమని అరకెత్తినారట. అంతే మరికాస్తా దిగబడిపోయింది."కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట". మనిసొక మాట అనేసరికి సిగ్గుపడిపోయి ఎలుగుబంటి ఒండ(గుహ)వైపుగా వెల్లిపోయారు. అక్కడ ఒండ ముందు ఒక పెద్ద సాపరాయి. రాయిమీద సోలు(రాగులు), నూకలు ఎందేసిందట ఎలుగు.వీరిని చూసి " మా ఈరకాలు(బావలు)లాగున్నారు,ఎందుకొచ్చారు?" అనీడిగితే "నిన్ను చంపి చెల్లిని తీసుకు వెళ్ళడానికి" అన్నారు వారు. అలగే సంపిద్దురు గాని, నేనేటికెళ్ళి తానం పోసుకొని వచ్చేలోగా సోలు మల్ల సోలూ, నూకల మల్ల నూకలు ఇడదీసీయాల లేక పోతే మిమ్మల్ని నేను మింగెస్తానని సోలూ,నూకలూ కలిపేసి వెళిపోయింది.తిరిగొచ్చేసరికి సోలడు గింజలు కూడా విడదీయలేకపోయారు. పందెం ప్రకారం ఒక తాటితో వారిని కట్టివేసి " రోజు శనివారం నేను కౌసు తిన్ను, రేపు తింటానని చెప్పి  ఏటికి వెళ్ళిపోయింది .          
పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి దేవుడో నా కొడుకులు ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి ఏడుస్తుండట పెద్దమ్మ. దారిన పార్వతీ పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం అయిపోయారు.
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది. పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే "దాని ఊసు నీకెందుకు ?భూమికి బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని, మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని బండిని ఎగ్గొట్టిస్తే అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల కర్ర తీసుకొని దాని చివర ఒక మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక ఎద్దు తోక మడిచి మరో ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట చీమలు కొట్టుకుపోతున్నాయి. చీమల్ని ఒడ్డుకు తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం చేస్తాము" అని చెప్పాయి.
       చిన్నోడు ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో "మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు? మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు. "సర్లే గాని నేను ఏటికెళ్ళి తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా చేస్తే నన్ను చంపి మీవాళ్ళని తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం' అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.

No comments:

Post a Comment