Sunday 26 November 2023

     !!.మృచ్ఛకటికమ్‌.!!

  మృచ్ఛకటికమ్‌  అనేది శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం. 

     సాధారణంగా సంస్కృత నాటకం అనగానే ఉదాత్త నాయకీనాయకులు, వారి మధ్య ప్రణయం, విరహం లాటివి వుంటాయి. కానీ దీనిలో దొంగలు, జూదరులు, విటులు, పోకిరీగా తిరుగుతూ జనాలపై జులుం సాగించే రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించే సైనికులు వీళ్లందరూ వుంటారు. ఈ నాటకం లోని చాలా దృశ్యాలు వీధుల్లో నడుస్తాయి. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్న వేశ్యను రాజుగారి బావమరిది వెంటాడిి, చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో నాటకం ప్రారంభమవుతుంది.


చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో ఉన్నాడు. అతని తాతముత్తాతలు వ్యాపారం చేసి చాలా గడించారు. ఇతను దానధర్మాలు చేసి డబ్బంతా పోగొట్టుకుని ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాడు. మనిషి అందగాడు, గుణవంతుడు. భార్య, చిన్నపిల్లాడు ఉన్నారు. అతన్ని ఆశ్రయించుకుని మైత్రేయుడు, వర్ధమానకుడు అనే అనుచరులు, రథనిక అనే పనిగత్తె ఉన్నారు. ఆ వూళ్లో వసంతసేన అనే వేశ్యాకులంలో పుట్టి, యింకా ఆ వృత్తిని చేపట్టని సుందరి ఉంది. ఆమె ఒక ఉత్సవంలో యితన్ని చూసి యిష్టపడింది. శకారుడనే రాజుగారి బావమరిది ఆమెను చూసి యిష్టపడ్డాడు. ఓ రోజు సాయంత్రం తన అనుచరుడితో కలిసి ఆమె వీధిలో నడిచి వెళుతూంటే వెంటపడ్డాడు. వసంతసేన అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వీధిలోనే వున్న చారుదత్తుడి యింట్లోకి దూరి రక్షణ పొందింది. చారుదత్తుడు కూడా ఆమెను చూసి యిష్టపడ్డాడు. మళ్లీమళ్లీ ఆ యింటికి వచ్చేందుకు వీలుగా తన నగలు తీసి మూటగట్టి 'శకారుడంటే భయంగా వుంది, మీ దగ్గర దాచండి' అని చెప్పింది. చారుదత్తుడి యిల్లు శిథిలావస్థలో ఉంది. ఈ నగలపాత్ర పోయిందంటే దరిద్రానికి తోడు అప్రదిష్ట కూడా. అందుకని పగలు వర్ధమానకుడు, రాత్రి మైత్రేయుడు దీన్ని కాపలా కాయాలని చెప్పాడు.


చారుదత్తుడి వద్ద ఒళ్లు పట్టేవాడిగా గతంలో పనిచేసిన సంవాహకుడు అనేవాడు యిప్పుడు జూదగాడై, జూదంలో ఓడిపోయాడు. జూదమండపం అద్దె కూడా చెల్లించకుండా పారిపోబోతే వాళ్లు తరుముకుని వచ్చారు. అతను పారిపోతూ, దారిలో వున్న వసంతసేన యింట్లో చొరబడ్డాడు. వాడు చారుదత్తుడి తాలూకు మనిషనే అభిమానంతో వసంతసేన అతని తరఫున డబ్బు చెల్లించి ఋణవిముక్తుణ్ని చేసింది. అతను సిగ్గుపడ్డాడు. ఇకపై యీ అలవాటు మానేసి బౌద్ధసన్యాసిగా మారిపోతానని చెప్పి వెళ్లిపోయాడు. శర్విలకుడనే బ్రాహ్మణుడు ఒక దొంగ. వసంతసేన వద్ద పనిచేసే మదనికను ప్రేమించాడు. ఆమె బానిసత్వాన్ని విడిపించడానికి డబ్బు సంపాదించాలని, దొంగతనానికి బయలుదేరాడు. రాత్రి చారుదత్తుడి యింట్లో కన్నం వేసి దూరాడు. అక్కడ మైత్రేయుడు నగలపాత్ర పట్టుకుని నిద్రపోతూ భయంతో పలవరిస్తున్నాడు. దొంగ తన దగ్గరకు రాగానే అతనే తన స్నేహితుడు వర్ధమానుడనుకుని 'ఇదిగో తీసుకో' అని దాన్ని యిచ్చేశాడు. అనాయాసంగా చేతి కందిన పాత్రను పట్టుకుని వచ్చి మదనిక దగ్గరకు వచ్చాడు. వసంతసేనకు విషయమంతా తెలిసి, నాకే పరిహారమూ అక్కరలేదు, వెళ్లి పెళ్ళి చేసుకోమంది. మదనికను బండి ఎక్కిస్తూండగానే ఆర్యకుడనే విప్లవకారుణ్ని బంధించారన్న ప్రకటన వినబడుతుంది. 'అతను నా స్నేహితుడు, వెళ్లి విడిపిస్తాను, నువ్వీమెను మా నాన్నగారింట్లో విడిచి వెళ్లు' అని బండివాడికి చెప్పి అతను వెళ్లిపోయాడు.


నగలు పోయిన సంగతి గ్రహించిన చారుదత్తుడు బాధపడుతూంటే అతని భార్య తన పుట్టింటివాళ్లు యిచ్చిన నగను చేతిలో పెట్టి వసంతసేనకు పంపించేయమంది. వసంతసేనను చారుదత్తుడి యింటికి వచ్చి దొంగతనం గురించి చెప్పి తన నగలను చూపించింది. వాళ్లిద్దరి మధ్య అనురాగం వెల్లివిరిసింది. మర్నాడు ఉదయం చారుదత్తుడు ఒక తోటకు వెళుతూ మైత్రేయుడితో వసంతసేనను గూటిబండిలో అక్కడకు తీసుకుని రమ్మనమని చెప్పి వెళ్లిపోయాడు. చారుదత్తుడి కొడుకు పొరుగింటి కుర్రాడు బంగారు బండితో ఆడుకోవడం చూసి తనకు కూడా అలాటిది కావాలని ఏడిస్తే పనిమనిషి మట్టి బండి చేసి దానితో వసంతసేన వద్దకు తీసుకెళ్లింది. పిల్లాణ్ని చూసి వసంతసేన నువ్వు కూడా బంగారుబండి చేయించుకో అంటూ తన ఒంటి మీద నగలు మట్టిబండిలో పోసింది. శకారుడి కోసం అదే తోటకు వెళుతున్న ఒక గూటిబండి సంచార రద్దీ కారణంగా చారుదత్తుడి యింటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది చారుదత్తుడు తనకోసం పంపించిన బండే అనుకుని వసంతసేన ఆ బండిలో కూర్చుంది.


శర్విలకుడు ఆర్యకుణ్ని విడిపించాడు. అతని సంకెళ్లతో సహా పారిపోయి వస్తూ వుంటే రాజభటులు వెంటాడారు. అతను తప్పించుకోవడానికి యిటుగా వచ్చి వసంతసేన కోసం వచ్చిన గూటిబండిలో ఒదిగి కూర్చున్నాడు. అది తోటకు చేరాక చారుదత్తుడు ఆర్యకుణ్ని చూసి, బంధనాలు విడిపించి పంపించివేశాడు. వసంతసేన ఎక్కిన బండి శకారుడి వద్దకు చేరింది. తను బతిమాలుకున్నా ఆమె వినకపోవడంతో కోపం తెచ్చుకుని పీక పట్టుకుని నులిమివేశాడు. ఆమె కుప్పకూలింది. శకారుడు ఆమెను ఎండుటాకులతో కప్పివేశాడు. ఇదంతా చూసిన తన సేవకుణ్ని తన మేడలో బంధించాడు. వసంతసేన వలన ఉపకారం పొంది బౌద్ధసన్యాసిగా మారిన సంవాహకుడు ఆ తోటలో తన బట్టలు వుతుక్కుని తడిబట్టల్ని ఆ ఆకులపై ఆరబెట్టాడు. అంతలో ఆకులగుట్ట కదిలింది. ఆకులు కదలించి చూసి వసంతసేనను కాపాడి తన ఆరామానికి తీసుకెళ్లాడు.


శకారుడు న్యాయాధికారుల వద్దకు వెళ్లి చారుదత్తుడు నగలపై ఆశతో వసంతసేనను చంపివేశాడని అభియోగం చేశాడు. మట్టిబండిలో దొరికిన నగలు ఆ ఆరోపణకు బలం చేకూర్చాయి. చారుదత్తుణ్ని కొరత వేయమని తీర్పు యిచ్చారు. అతన్ని వధ్యభూమికి తీసుకెళుతూ చాటింపు వేస్తే అది విన్న శకారుడి సేవకుడు మేడ నుంచి దూకేసి శకారుడే హంతకుడని అందరికీ చెప్పాడు. శకారుడు వాడు దొంగ అనీ, పట్టుకున్నందుకు తనపై కోపంతో అలా చెప్తున్నాడనీ జనాల్ని నమ్మించి చారుదత్తుడికి సహాయం అందకుండా చేశాడు. అతని కొరత ప్రకటన విన్న వసంతసేన వధ్యభూమికి చేరింది. చారుదత్తుడిపై కత్తి ఎత్తిన తలారి తత్తరపడ్డాడు. వసంతసేన సజీవంగా వుందని చూసిన శకారుడు భయంతో పారిపోసాగాడు.


    ఇంతలో శర్విలకుడు వచ్చి ఆర్యకుడు రాజుని చంపి కొత్త రాజయ్యాడని, తనను కాపాడినందుకు కృతజ్ఞతగా కుశావతీ రాజ్యాన్ని చారుదత్తుడికి ధారాదత్తం చేశాడనీ చెప్పాడు. పారిపోబోయిన శకారుడు పట్టుబడ్డాడు. అతన్ని చంపెయ్యబోతూ వుంటే చారుదత్తుడు ప్రాణభిక్ష పెట్టాడు. చారుదత్తుడు మళ్లీ ఐశ్వర్యవంతుడయ్యాడు. వసంతసేనను చేపట్టడానికి అతని భార్య అనుమతించింది. ఆర్యకుడు సుభిక్షంగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు. ఇదీ కథ.


Friday 14 April 2023

 ద్వాపర యుగం లో ప్రియదర్శిని (లాప్ టాప్), దివ్య నేత్రము(CC cam),దివ్యదృష్టి(స్పైకేమ్), ఆకాశ వాణి(అంతర్జాలము)Internet, మొదలైన ఉపకరణ లు ఉండేవని ఇతిహాసములు చెప్పుచున్నవి.... అప్పుడు కూడా 

Face Book ఉండి ఉంటే,

అప్పట్లో చాటింగ్ ఎలా సాగేదో తెలుసా…….!


ప్రియుడు :- నెచ్చెలీ………!

ప్రేయసి :- సఖా……!

ప్రియుడు :- రాత్రి భోజనము భుజించితివా  ?

ప్రేయసి :- అయినది సఖా. మరి మీరు ఆరగించితిరా ?

ప్రియుడు :- ఏమి ఆరగింపులే చెలీ! నిరతము నీ పరితాపము న నేనేమరుపాటుననారగంచుటయే మరచితిని. ………..!

ప్రేయసి :- ఆఁ...ఆఁ...హతవిధీ! అంత పని చేయకుడి...!!! 


ప్రియుడు :- లేదులే సఖీ!పరిహాసమున నిటుల పలికితి...ఇపుడే ముఖవాచకమును తెరిచితిని. అందు నీవు యెగుమతి చేసినట్టి “స్వచ్చిత్తరువు” మహత్తరము. అక్కజముగ మిక్కుటమైన మక్కువలను నొక్కివక్కానింప తక్కిన అక్కరలన్నీ పక్కన పెట్టి అక్కరములతో చేజిక్కిన చరవాణి ని గ్రక్కున నొక్కాలని యొక్క కోర్కె కలిగినది. కానీ ఒక్క మక్కువే నొక్కిన లెక్కకు వచ్చును కదా !అని సరిపుచ్చుకొంటి... 


ప్రేయసి :- నా యొక్క స్వీయ చిత్రము(dp) తమకు అంతగా ప్రియమైనదా ప్రియా ?


ప్రియుడు :- అవును దేవి. మధుర మదిరా రసాఛ్ఛాదిత మదురసాపూరిత అధరసుధామధురసాన్ని గ్రోలాలని నా పెదవులు ఎంత ఆరాట పడుచున్నవో!!! 


ప్రేయసి :- పోదురు!!!. మీరు మరీనూ…….


ప్రియుడు :-మంచుతెరల దుప్పటిలో పుడమికాంత ఆదమరచి నిదురోతున్నప్పుడు, నీ నులివెచ్చని ఒడితలగడపై నేను తలవాల్చి నీకన్నులలోకి తదేకంగా చూస్తున్నప్పుడు నీ కురుల వింజామరలతో విసురుతుంటే మలయమారుతమేదో  నా వదనాన్నితాకినట్లు...ఆప్పుడు ఒకింత కలిగిన పులకింత ఇంతవరకూ నాకెంతో గుర్తుంది ...తెలుసా... 


ప్రేయసి:ఛీ!!! నాకుసిగ్గేస్తుంది... 


ప్రియుడు: హేమంతఋతువు, చల్లని రేయి,అప్పుడే మంచు తెరలలను తొలగించుకొంటూ బాల శశిబింబము కురిపిస్తున్న వెన్నెల వెలుగులు నా విరహాగ్నిని నిప్పులను విసనకర్రతో విసిరినట్లు మరింత అధికం చేయుచున్నాయి. ఆ తరుణంలో నీ రాక గ్రీష్మఋతువు మిట్టమద్యాహ్నం భానుని తీక్షణ కిరణ తాకిడికి వేడెక్కిన సుర్యకాంతశిల పై పడిన మంచు వర్షం వలే నాకు హర్షం కలిగించలేదా? పరవశాన నీ చెక్కిలి తాకిన న పెదవులు చిరునవ్వుల అలికిడికి చిరుగాలి సవ్వడికి అదిరె చిగురాకుపెదవులు చిలికిన మధువును నా చూపులు నీ పెదవులు దాటి ఎటులైనా మరలాలని ఎంత ప్రయత్నించలేదూ?


ప్రేయసి: హలా!!! అలా వలపులు చిలికించి నామదిపులకించగ పలికించకు నీ మురళీ గానము నా వీనులకు నెచ్చెలీ!!! ...సరే సద్దు అవుతుంది... ఉంటాను...మరళ బ్రహ్మీముహుర్తాన తప్పిన పిలుపు నిచ్చెద... నీ చరవాణిని ప్రకంపనాయుతపరాకుననుంచుము...

Monday 10 April 2023

 *ఉత్తమ ఉపాధ్యాయుడు*

అవార్డు వచ్చిందంటే సమాజంలో చిన్నచూపు... 

అవార్డు రావాలంటే.... 

*అధికారుల చుట్టూ తిరగాలి.

*చదువు చెప్పకుండా మిగతా పనులన్నీ చేయాలి... 

-అంటే... నేత్రవైద్యశిబిరాలు

... రక్తదానశిబిరాలు

... పుస్తకాలు, కవిత్వం రాయాలి. 

... సంఘ సేవ, మొక్కలు నాటడం, ఎయిడ్స్, పేదలకు పండ్లు పంచడం, మొదలైనవి చేస్తున్నట్లు గా ఫోటోలు,... 

... స్కూల్ కి వెళ్లక పోయినా ఫరవాలేదు... రికార్డు లు ముఖ్యం... *వచ్చిన వారందరూ ఇటువంటి వారే అనుకుంటున్నారు. సమాజము... (కొంతమంది స్కూల్ ఎగ్గొట్టి స్కీమ్ లు, రియల్ ఎస్టేట్ లు, జీవిత భీమా, చిట్ లు వంటివి చేసేవారికి అవార్డు లు రావడం చూసి.)

    కొంతమంది సైడ్ బిజినెస్ లు చేసినా వారి డ్యూటీ సక్రమంగా చేస్తారు... సమాజం లో కూడా మంచి పేరు ఉంటుంది... 

కొంతమంది వారి స్వప్రయోజనమును పక్కనబెట్టి విద్యార్థుల ఉన్నతికే పాటుపడేవారు ఉంటారు... కానీ వారికి గుర్తింపు దొరకదు... కారణాలు అనేకం... మనతో నవ్వుతూ తిరుగుతూ మన వెనకనే గోతులు తీస్తారు... 

మన స్టేఫ్ లోనే మనమంటే కొందరికి చూడలేని తనం... ముఖ్యంగా హైస్కూల్ లో ఈ జాడ్యం ఇంకా ఎక్కువ... 

... *కనుక నేను చెప్పొచ్చేదేమిటంటే రిటైర్ అయ్యే లోపు ఎలాంటి రిమార్కులు లేకుండా, మాటపడకుండా గౌరవంగా వెళిపోతే అంతకంటే పెద్ద అవార్డు మరొకటి ఉండదు...*

Thursday 23 March 2023

 తెలుగు సాహిత్యం లో అత్యంత క్లిష్టమైన పద్యము-సాహిత్య గోష్ఠులలో పండితులకు కొరుకుడు పడని పద్యం...

కం. *కమలాకరకమలాకర కమలాకర కమల కమల కమలాకరమై కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని రా సుదతుల్.*


- ఈ పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పృచ్ఛకులకూ, అవధానులు ఒక కేళీ వినోదంగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి వారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.


ఆ సుదతుల్ = అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు;

 కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, 

ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, 

కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, 

కమల కమల కమలాకరమై - కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, 

కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, 

ఆకరమై = - నివేశనమైనది; *కమలాకర* - క = మన్మథునియొక్క, 

మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, 

కర = కూర్చునదై, 

*కమలాకర* - కమలా = పద్మినీజాతి స్త్రీలకు, 

క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదకై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి .... సేకరణ:వల్లూరు  దాలినాయుడు.

సేకరణ

కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకసారి ఒక కవి (ప్రెగడరాజు నరస కవి) వచ్చి అష్టదిగ్గజ కవులకు ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే మీలో ఎవరు ఏది చెప్పినదాన్ని నేను వెనువెంటనే రాయగలను మరియు మీరు చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టగలను లేదా మీరు నేను చెప్పిన దాన్ని రాయండి, నే చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టండి. వీటికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు.

దీనికి అక్కడివారందరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆసమయంలో తెనాలి రామకృష్ణకవి ముందుకు వచ్చి నే చెప్పేది రాయమని ఈ క్రింది పద్యం చెప్పాడట.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!

(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు - వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది - మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)
రామకృష్ణకవి చెప్పెడి విధానం పద్యం పలికే తీరు అర్థం కాక ఆ వచ్చిన కవివతంసుడు రాయలేక నిలిచిపోయాడు. దాన్ని ఎలా రాయాలో తెలియని గందర గోళంలో పడిపోయాడా పండితుడు.

ఈ సందర్భంలోని చమత్కారం పద్యం గొప్పతనాన్ని కప్పేసింది.

పూర్తి అర్థం

తృవ్వు+అట.. ‘తృవ్వట’. పశువుల్ని బళ్లకి కట్టి తోలుతున్నప్పుడు బండివాడు వాటి తోకలను మెలిపెట్టి, ఆ ఎడ్లకి హుషారు నిమిత్తం పలికే ధ్వన్యనుకరణ శబ్దమిది.

‘బాబా’ అంటే వాహనం (గుర్రం). ‘తృవ్వట’ అనేది ఎద్దుకి సంకేతం. ‘తృవ్వట బాబా’- ఎద్దు వాహనం- శివుడిది. ‘‘ఎక్కెడిదెద్దు భూతియును నెమ్ములు సొమ్ములు...’’ (శివుడికి) అని ఎర్రన తన నృసింహపురాణంలో పేర్కొన్నాడు. ‘తలపై పువ్వట జాబిల్లి’.. హరుడి శిరసులోని పుష్పం చంద్రుడు. శివుడు చంద్రశేఖరుడు కదా! ‘‘వలిమలయల్లువాడు తలవాకధరించిన పువ్వుగుత్తి!’’ అని చంద్రుణ్ని వర్ణించాడు ముక్కు తిమ్మనకవి. ఇక ‘వల్వ బూచట!’ అనే దానికి పాఠాంతరముంది.. వల్వ బూదట! అని. వల్వ అంటే వస్త్రం. శివుడి వాలకం బూచాడు కదా! భిక్షువు లేదా దిగంబరుడు! ఆయన ఒడలంతా విభూతి (బూది).. బూచి+అట- బూచట, బూది+అట- బూదట. ‘చేదే బువ్వట!’- చేదు అంటే విషం. పార్వతీ పతికి కాలకూట విషమే అన్నమైంది. దేవదానవులు అమృతం కోసం పాలకడలిని మథించినపుడు మొదట హాలహలం పుట్టింది. దాన్ని హరుడు ‘‘అల్లనేరేడు పండువలె మిసిమింతుడు గాక మ్రింగినాడు!’’ అన్నాడు శ్రీనాథ మహాకవి. ‘‘వెన్నెలతల సేదుకుత్తు కయు’’ అని పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకంలో వాక్రుచ్చాడు. ‘‘మ్రింగమన్న సర్వమంగళ తన మంగళసూత్రమును మదిలో నెంత నమ్మినదో!?’’ అన్నాడు పోతన.
‘చూడగను హుళక్కవ్వట!’.. పరికిస్తే శూన్యమే ఆయనకి అవ్వట! ఆ శివుడి పుట్టుక ఓ మాయ! ఆ తల్లి- ఆ పరము నికి అమ్మట! లయవేళ సకల సృష్టి నాశనార్థం స్థాణు రూపేణా అవతరించే మహాతత్త్వమే ఆ అద్భుతమూర్తి. గుణా లున్నపుడే ఆయనకి ఈ రూపమూ, దానికో వర్ణనమున్నూ. నిర్గుణుడయ్యాడో ఆయన పరతత్త్వంలో లయమైపోతాడు. కాబట్టి- హుళక్కి! ఇక్కడ మరో రమణీ యార్థమూ ఉంది. ‘చూడము’- అంటే తల. అది హుళక్కి! అంటే శూన్యం- ఆకాశం! శివుడికి అద్భుతమైన మరోపేరు ‘వ్యోమకేశుడు’! శూన్యాకాశమే శివుడి జటాజూటం! ఆయన అందుకే ‘ధూర్జటి!’.
భావంలో ఇలా నిలిచిన ‘హరునకు జేజే!’- ఆ పరమేశ్వరునికి ప్రణామాలర్పించాడు రామలింగడు

Sunday 9 October 2022

 ***సీతా కళ్యాణం***

అమ్మా!!!ముద్దుగుమ్మ - సక్కాని పైడిబొమ్మా!

ఆది విష్ణుకు నీవు - యిల్లాలువైతీవి

సక్కాని పసిడి బొమ్మా - సక్కాని బంగరు బొమ్మా

అమ్మ ! రావమ్మా!  - రాగిడి చంద్రొంకా!

రంగైన నగలు - గీర్వాణి జటపాలి

చామంతి పువ్వులు -దరియించుదూవు

తమ్మిట్లు జుమకాలు - ఆపాల జోలీలు

నామాలు పుట్టిల్లు - అందమైనట్టి

వజ్రాల కామాల - యాముల్ల పట్టీ

పొందుగా వజ్రాల - కామాల దట్టి

దరియించుదూవు - అమ్మ రావమ్మా!

ఆ దండకడియాలు - బుజాల బందులూ

మురిడీలు గొలుసులూ - ముద్దు టుంగరాలూ

దరియించుదూవు - అమ్మ రావమ్మా!

నడుముకొడ్డాణంబు - యా నాగబందంబు

మువ్వలొడ్డాణంబు -  మురిపాలమువ్వలు

దరియించుదూవు - అమ్మ రావమ్మా!

అందెలూ కడియాలు - అమరంగ పట్టీలు

మట్టెలు బొందులూ - ఘణ కంకనములూ

దరియించుదూవు - అమ్మ రావమ్మా!

Monday 12 April 2021

ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1
ఉ.రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2
చ.అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3
ఉ.రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స
త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా
తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!4
ఉ.శ్రీద సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!5
ఉ.ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యుల కంజలెత్తి కవిసత్తములన్‌ వినుతించి కార్యసౌ
కర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్‌ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!6
చ.మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్‌ వెలబోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!7
ఉ.శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం
దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో
ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!8
చ.దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ
భరణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి
స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం
ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
9చ.కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం
జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం
దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ!10

అగస్త్యుడు

 *అగస్త్యుడు*

* అగస్త్యుడు మహాతపస్వి.

* ఆకాశాన్ని అతిక్రమించిన వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసాడు.

*తన పైకి దాడిచేసిన తాటకను శపించాడు.

*వాతాపి ని జీర్ణం చేసుకున్నవాడు. 

* రామునికి దివ్యధనుస్సు, అక్షయతూణీరం, దివ్యఖడ్గం ఇచ్చాడు.

* సీతాదేవి సాహసాన్ని,  భర్తృప్రేమను కొనియాడాడు. 

* పంచవటి లో నివాసం ఏర్పాటు చేసుకోమని సూచించాడు. 

* రామునికి విజయం వర్ధిల్లుతుందని ఆశీర్వదించాడు. 

* రామరావణ యుద్ధసమయంలో యుద్ధరంగానికి వచ్చి రామునికి ఆదిత్యహృదయం ఉపదేశించాడు.

దశరధుడు - పాత్రస్వభావం

 *దశరధుడు*

* అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించిన రాజు దశరధుడు.

* దేవతల పక్షాన రాక్షసులలో పలుమార్లు యుద్ధం చేసి విజయాన్ని అందించిన వీరుడు..

* ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. 

* సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసి రామలక్ష్మణభరతశతృఘ్నులను పాత్రులుగా పొందాడు.

*పుత్రులంటే అమితమైన ప్రేమ.

* రాముడంటే ప్రాణం.

* ఆడినమాట తప్పనివాడు. 

*విశ్వామిత్ర యాగసంరక్షణకు రామలక్ష్మణులను పంపాడు. 

* కైకేయి వరాలను ఇవ్వడంలో సతమతం అయ్యాడు.

*రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు పుత్ర పుత్రవియోగంతో మరణించాడు.

త్రిజట పాత్రస్వభావం

[06/04, 6:22 pm] Murali: 
*త్రిజట*
* విభీషణుని కూతురు.
* ధర్మ వర్తన కలది.
* సీతమ్మ ను భయపెడుతున్న రాక్షసస్త్రీలను అదలించేది. 
* రావణుడి కి  రామునిచేతిలో పరాజయం తప్పదని చెప్పింది.
* తన స్వప్న వృత్తాంతం చెప్పి సీతమ్మ కు ధైర్యం చెప్పేది.
* యుద్ధ సమయంలో రామలక్ష్మణులు మరణించినట్లు రావణుడు సీతను నమ్మించినపుడు అది అంతా రావణుడి మాయ అని చెప్పి సీతకు ధైర్యం చెప్పింది.
*గంజాయి వనం లో తులసి మొక్క వంటిది త్రిజట.

Sunday 10 May 2020

***పేదరాశి పెద్దమ్మ...పొట్టేలు***

 ఒకరోజు పేదరాశి పెద్దమ్మ గడపలో కూకోని ఉంది. ఆ దారిగుండా ఆవూరి గుంటలు కొందరు వలలు,ఊజులు,టిర్రెలు ఎత్తిడ్లూ,పట్టుకొని పెద్దచెరువు  కాసి పెరిగెడతన్ర్రు... అందులో ఒకన్ని ఆపి విషయం కనుక్కొని తనూ పెడకన వున్న ఊజు తీసి బూజు దులిపి టిర్రి భుజాన తగిలించుకొని బయలుదేరింది. తొలుత చిన్న ఇలుసు దొరికింది. తరువాతప్రయత్నిస్తే పిత్తపరిగి,తరువాత చుక్క పరిగి,ఆనక బేడిసి,సీకొక్కెడం,జల్ల,బొడిగి,బొమ్మిడం,మిట్ట, తాటిమిట్ట,బురద మిట్ట,రొయ్య,ఎండ్రికి,పీత,మార్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతుంటే టిర్రెలో వేస్తూ అది తీసి ఇది.అలా అన్నీ నీటిలో వదిలేస్తూ ఉంది. చివరకు ఒక పెద్ద సవడ(కొరమీను)దొరికింది.దానితో తృప్తిచెంది, ఇంటిముఖం పట్టింది పెద్దమ్మ.
   కత్తిపీట, పొయ్యిబుగ్గి,పలక రాయి సిద్ధం చేసుకొని, సవడను పొయ్యిబుగ్గిలో పొరిపి,పీక పట్టుకొని కత్తిపీటకు ఆనించి కొయ్యబోతుంటే.... సవడ తననే దీనంగా చూస్తూ వదలమని వేడుకుంటున్నట్లుంది.
   పెద్దమ్మకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పిల్లలు అందరూ ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఒంటరి అయిపోయింది.కనుక ఈ సవడ వుంటే తనతో కాలక్షేపం అవుతుందని తలచి,సవడను నీటితో కడిగి, గోలెంలోని నీటిలో విడిచిపెట్టింది. 'బంగారూ' అని పేరు పెట్టుకుంది.షరాబులింటికెళ్ళి,చిన్న వ్యాపారంకమ్మి చేయించి బంగారుకి కుట్టించింది.  బంగారూ అని పిలిస్తే నీటిలోంచి పైకి వచ్చేది ఇన్ని నూకలేస్తే తినీసి ఎళ్ళిపోయేది.రోజూ పెద్దమ్మకు బంగారు లేనిదే గడిచేదికాదు.
    ఒకరోజు సంతకు బయలెలుతూ ఉట్టిపైన వండిన అన్నంపెట్టి, పక్కింటి వారికి ఇంటి తాళం ఇచ్చి అంబల్లేలకి మా బంగారుకి కొంచెం నూకలు వెయ్యండి అని చెప్పి వెళ్ళీంది. పకాల్లేలకి(10 గంటలకు) పక్కింటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళకు మర్యాద చెయ్యడానికి వూరిల్కి గుడ్డులకోసం వెళితే దొరకలేదు.ఏమి చెయ్యాలా పరువు పోద్ది అని ఆలోచిస్తుంటే  అప్పుడు వారికి పెద్దమ్మ పెంచుకుంటున్న సవడ గుర్తుకొచ్చింది. తరువాత నెమ్మదిగా పెద్దమ్మకు చెప్పుకోవచ్చనుకొని, ఆ సవడను కూర చేసి చుట్టాలకి వడ్డించేశారు.అలబొద్దులేలకి  పెద్దమ్మ సంతనుండి వచ్చి, ఆకలికి తాలలేక ఉట్టిమీదున్న వట్టన్నమేమి తింటానని పక్కింటికెళ్ళి చారో,కూరో కసింత ఇమ్మని అడిగితే,వాళ్ళు మిగిలిపోయిన ఇగురు(గ్రేవీ)సట్టి(మట్టిపాత్ర)తో పాటు ఇచ్చేసారు.
     అన్నం లో ఆ ఇగురు కలుపుకొని తింటుంటే పంటికింద ఏదో రాయి తగిలింది. తీసి చూస్తే యాపారంకమ్మి, "ఇందులోకి ఎలా వచ్చింది,వచ్చిందబ్బా!!!? కొంపతీసి మా బంగారును పక్కింటోళ్ళు ఏటైనాసేసీసినారేటి...!!!?" అనుకొంటు గోళెం దగ్గరకు వెళ్ళి, "బంగారూ" "బంగారూ" అంటూ పిలిచింది పెద్దమ్మ. ఇంకెక్కడి బంగారు?. నీటిలో సెయ్యెట్టి తడిమి సూత్తే బంగారు నేదు. ఇది పక్కింటోళ్ళ పనే అనుకొని ఆళ్ళను నిలదీసింది.ఆలు ఇలగిలగ అని పెద్దమ్మకు నచ్చసెప్పడానికి శతయిదాలా పయత్నం సేసినారు.. కానీ ఇంతాది...పెద్దమ్మ...నోటికేదొత్తే అదే..పరువు తీసేత్తంది.ఫలితం నేకపోయింది.ఊరూ వాడా ఏకమయ్యేట్టు ఒకటే ఏడుపు, ఒకటే దీవెన,"మీకు రోజ్జెయ్య, మీకు గాడుప్పుట్ట, సంకటంపుట్ట,మీ మందమాసిపోనూ,గాలీవానెత్తుకుపోను,మీకు దినవారమెట్ట,మీ నెట్టిగొట్ట,మీకు పోగాలం రాను,మికు దిబ్బెయ్య,మీకు బుగ్గెత్తా,మీకు పిండం పెట్ట..మీకు దీశమెట్ట... మీకసిరమ్మిరిసియ్య, నూకాలమ్మ నవిలియ్య...మీ నోట్లో పుండుపుట్ట,మీకొక పాముపొడ,ముండగాసిన ముండపాపా మా బంగారే మీకు దొరికిందా?" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా రోజల్లా తిట్టింది. ఆతిట్లు వినలేక పక్కింటోళ్ళు తలుపేసుకున్నారు. పెద్దమ్మ అంతటితో ఆగకుండా ఆ ఊరిలో దాలినాయుడు దగ్గరకు వెళ్ళి తగువు పెట్టింది. దాలినాయుడు పక్కింటోలిని పిలిచి, పెద్దమ్మకు సవడ బదులుగా ఒక గొర్రె పిల్లనిమ్మని తీర్పుచెప్పాడు.
    పెద్దమ్మ ఆ గొర్రెపిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అది పెరిగి పెద్దదయింది.
    ఒక రోజు ప్రక్క వూరిలో జాతర జరుగుతుంది. అందరూ జాతరకి వెళుతున్నారు. పొట్టేలు(గొర్రె పోతు) పెద్దమ్మతో ఇలా అంది "పెద్దమ్మా పెద్దమ్మా అందరూ యాత్రకు ఎలతన్నారు, నేనూ ఎలతాను "అని. ఎప్పుడూ అడగనిది అడిగిందని చెప్పి డబ్బులిచ్చి, పంపించింది."చీకటి పడిపోయేంతవరకూ అవీ,ఇవీ సూసుకోని ఉండిపోకు,ఒకాల సీకటిబడితే పార్రాకు. సుబ్బిశెట్టి గోరింటికెళ్ళి ఇలగిలగ పెద్దమ్మ తాలూకా అని చెబితే అతను మరియాద సేత్తాడు"అని జాగ్రత్తలు చెప్పి పంపించిచింది పెద్దమ్మ.
పొట్టేలు జాతరంతా తిరిగి కావలిసినవన్నీ కొనుక్కొని, చూడాల్సినవన్నీ చూసేసరికి పొద్దుబోయింది. సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళి ఇలగిలగ అని చెబితే అతను సామాన్ల గది చూపించి అక్కడ పడుకోమని చెప్పాడు. ఆగదిలో ఒక బస్తా నిండా వజ్రాలు,మరో బస్తా నిండా రత్నాలు, ముత్యాలు, బంగారం,పగడాలు, ఒకటేమిటి? ఆసంపదను చుసేసరికి కొంచెం స్వార్దం పుట్టింది పొట్టేలుకు. ఒక్కో బస్తాలో కొంచెం కొంచెం బంగారు కాసులు,రత్నాలు,వజ్రాలు,ముత్యాలు అన్నీ మింగేసి పెందిలకదనే షావుకారికి చెప్పి బయలుదేరింది. నడవలేక నడవలేక వస్తున్న పొట్టేలు దారిన పోతున్న తలయారితో "నాను పారొత్తన్నానని,బెంగెట్టుకోవద్ద"ని చెప్పి "బొంత పరిసి,రోకలి సిద్దం చెయ్య"మని చెప్పింది. పెద్దమ్మ బెంగపెట్టుకోని ఏటిజరిగిందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. జరిగిన సంగతంతా పెద్దమ్మకు చెప్పగా రోకలి తో కుడి ప్రక్క పొడిస్తే ఇన్ని వజ్రాలు నోటింట పడ్డాయట.ఎడమ ప్రక్క పొడిస్తే ఇన్ని రత్నాలు పడ్డాయట. పడిన సంపదని కొలవడానికి పక్కింటోలింటికి సోలకు వెళ్ళింది."ఏమిటి కొలుస్తాదా చూడాలని సోల అడుగున చింతపండు అంటించి ఇచ్చారు.
   కొలిచి గూనలోవేసి దాచింది పెద్దమ్మ. సోల వారిది వారికిచ్చివేసింది.సోల అడుగున వున్న రత్నాలను,వజ్రాలను చూసి అశ్చర్యపోయారు పక్కింటివారు. పెద్దమ్మ దగ్గరకి వచ్చి ఆరా తీయగా ఇలగిలగ అని చెప్పింది.
  పక్కింటోళ్ళు ఒక బేపి(కుక్క)ను పెంచుతున్నారు. వారు ఆబేపి(కుక్క)కి ఇలగిలగ అనిచెప్పి యాత్రకు పంపారు. ఆ బేపి(కుక్క) యాత్రలో కజ్జిపుండలు,కనికులు,జీడిలు,నెయ్యుండలు ,బూర్లు ,గార్లు ,బూందీఉండలు,పోకుండలు ,అరిసిలు ,పొంగడాలు,ఉటంకులు,కరకజ్జము,కాజాలు..బాల్సులు...మడతకాజాలు...సున్నుండలు...రవ్వలాడూలు...పాలమింజిలు..కొబ్బరి మిఠాయి..సేగొడాలు..జంతికులు...సుప్పులు...కనిపించినవన్నీ కొనుక్కొని తిని సాయంత్రానికి సుబ్బిశెట్టి ఇంటికిపడుకోవడానికి వెళ్ళింది. అర్ధరాత్రి నెమ్మదిగా సరుకుల గదిలోకి చొరబడి రత్నాలను మింగబోయింది. దురదృష్టం కలసి వచ్చింది. అదే సమయానికి శెట్టికి మెలికువ వచ్చింది,సామాన్లగది తెరిచి వుండడం చూసి,కర్రతీసి ఎవరు తీసారో చూడగా కుక్క కనిపించింది.అంతే కర్రతో నడుముకడ్డంగా ఒక్కటేశాడు. అంతే కైయ్...కైయ్... మంటూ కుక్క ఒకటే పరుగు.
    ఖాలీ కడుపు తోనిగాని ఇంటికెల్లినానా గొల్లోలు ఊరుకోరు. అందుకని గడ్డి,మన్నూగిన్నూ అన్నీ తినీసి
   నడలేక నడలేక జోగుకోని ఊగుకోని వస్తుంది. ఆ దారిని ఆలూరి మడియారి ఎల్తుంటే "అన్నా!అన్నా! నేనొచ్చీసరికి ఆగమవుద్ది బెంగెట్టుకోవద్దని మాకోనారికి కవురెట్టీరయ్యా నీకు పున్నెముంతాది."
      బేపి ఇంటికొచ్చీసింది. "ఎంత దనం మోసికొచ్చిందో మాతల్లి మాలచ్చిమి" అంటూ పరుపేసీసి బేపిని తొంగుండెట్టీసి రోకల్దెచ్చి ఈ పక్కన బొడిస్తే ఇంత మన్నూ, ఆ పక్కన బొడిస్తే ఇంత గడ్డీ పడ్డాయట.
   "ఓలె దరిద్రగొట్టుదానా ...ముదనస్టపుదానా...సెండాలందానా...ఏటి తినీసినావే..." అంటూ రోకలి కర్రతోటి నడుము జారగొట్టీసినారు. కంయ్యి...కంయ్యి...మంటూ బేపి ఒకటే పరుగు......