Monday 29 October 2012

మురళి// వాకబు //

నను వీడిన నిను మరువలేక

మనసంతా కల్లోలమై నిలువలేక


నీ తలపుల భావనలను విడువలేక

నువు నడయాడిన నందన వనిలో


నీజ్ఞాపకాల సోయగమును సోకాలని

నువు తాకిన తరు శాఖల వాలాలని


నినుతాకిన సుమ సౌరభాన్ని గ్రోలాలని

నువు సాకిన నీడజముల తాకాలని


నువు పెంచిన సుమతరువుల కాంచాలని

మనసు నిలువలేక వచ్చితినా....


మల్లెలనడిగితిని నీచిరునామాఎక్కడని

నిను జూసిన మల్లెలు తెల్లబోయినవట


తుమ్మెదలనడిగితిని నీకబురిమ్మని

నీఅధరమధురసాస్వాదనలో మైమరచినవట



మధుమాసమునడిగితిని నీపదముల జాడేదని

చామంతుల చూపించి ఈవన్నెలరాశిని

నిముషమునకుముందేకన్నానని చెప్పినది


కరిమబ్బునడిగితిని నీ అలికిడి ఏదని

మెరుపుతీగల నడుమ తెలుసుకోలేవట


జాబిల్లినడిగితే మలిసంధ్య వేళలో నీకన్నుల

కలువ రేకుల లో తొంగిజూసి మరిచెనట


పండువెన్నెలనడిగితిని మనసు తాలలేక

ముఖ చంద్రుని కాంచి చిన్నబొయినవట

dt 29/10/12

Thursday 25 October 2012


 చెమర్తకారి

ఒకరోజు భోజరాజు, కాళిదాసు మారువేషాలలో రాజ్య పర్యటనకి వెలుతున్నారు. ఒక గ్రామంలో ఉదయాన్నే ఒక

ఇల్లాలు కల్లాపి చల్లుతూ ఉంది. ఇంతలో దగ్గరలోని ఒక చెట్టుపై కాకి "కావ్ కావ్" మని అరిచింది. అంతే కల్లాపి పాత్ర

అక్కడే పడేసి,తన మొగుడ్ని వాటేసుకొని "ఓరి నా మొగుడో..." అంటూ భయపడి,వణికిపోతూ అతన్ని

వాటేసుకుందట.

    ఆ సన్నివేశాన్ని చూసిన భోజుడు కాళిదాసుతో "నారాజ్యం లో ఇంత పిరికివారు ఉంటారా"అన్నాడట. అప్పుడు

కాళిదాసు "పట్టపగలు కాకి అరిస్తే భయపడే ఆడది అర్ధరాత్రి కావేరీ నదిని అవలీలగా దాటిపోతుందట" అని అన్నాడు.

కావేరీ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. పగలే యెవ్వరూ దాటలేరు.

    కాళిదాసు చెప్పాడంటే నమ్మవలసిందే... అని గూఢచారులను నియమించి ఆమెను ఒక కంట

కనిపెట్టమన్నాడట.

   ఆమె తన ఇంటికి వచ్చిన కుక్కలను తలుపులేసి చంపి వాటి మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి మొగుడుకి రాత్రి

భోజనం లో నల్లమందు కలిపి పడుకోబెట్టి అర్ధరాత్రి ఆ బుట్టను మోసుకుంటు కావేరీ నది దాటుతూ తనను

తినబోవడానికి వచ్చే మొసళ్ళకు ఈ మాంస ఖండాలను విసురుతూ కావేరీ నదిని అవలీలగా దాటిపోయి ఆవలి

తీరాన వున్న తన ప్రియుని రోజూ కలుసుకుంటుందట.

Wednesday 17 October 2012


మురళి// ఉపమానం //
మన స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
ఎందుకంటే పువ్వు వాడిపోతుంది

మనస్నేహాన్ని కడలితో పోల్చవద్దు
ఎందుకంటే ఉప్పగా ఉంటుంది అది

మన స్నేహాన్ని మంచుతో పోల్చకు
ఎందుకంటే అది కరిగిపోతుంది చూడు

మన స్నేహాన్ని వసంతంతో పోల్చకు
శిశిరం వచ్చిందంటే మోడుబారిపోతుంది

మనస్నేహాన్ని కాలంతో పోల్చకు
ఎందుకంటే అది కదిలిపోతుంది

మనస్నేహాన్ని గువ్వతో పొల్చకు
ఎందుకంటె అది ఎగిరిపోతుంది

మన స్నేహాన్ని సుధతో పోల్చకు
ఎందుకంటే అది దేవతల సొంతం

మన స్నేహాన్ని తేనెతో పోల్చకు
ఎందుకంటే అది ఎత్తులో ఉంటుంది

మన స్నేహాన్ని స్వర్గంతో పోల్చకు
ఎందుకంటే అక్కడ అనుబంధాలుండవు

మరి దేనితో పోల్చాలి...........

అవినీతితో పోల్చు
ఎందుకంటే అది శాశ్వతంగా ఉంతుంది

అన్యాయంతో పోల్చు
ఎందుకంటే అదెప్పుడు తరిగిపోదు

అధర్మంతో పోల్చు
అదెప్పుడూ నాలుక్కాళ్ళతో నడుస్తుంది

లంచగొండితనంతో పోల్చు
అది వేళ్ళు పాతుకు పోయింది

దారిద్యంతో పోల్చు
అది అంతులేనంత ఉంది

పేదరికంతో పోల్చు
అది దిదినాభివృద్ధి చెందుతూవుంది

తే 17/10/12 దీ రాత్రి 7.45










Sunday 14 October 2012


మురళి//ఆరాటము//
మధుమాసపు వెన్నెలలో
మరుమల్లెల జల్లులలో
మదిని దోచిన చిన్నది
ఎచట దాగి యున్నది
ఎదుట రాకయున్నది

నీ బుగ్గమీది  నిగ్గు చూచి
అరవిరిసిన గులాబి మొగ్గ
సిగ్గులతో తలదాచుకున్నది
నా చెంపకెంత చెలగాటమో
నీ బుగ్గపైన నిగ్గులన్నినిమరాలని

నీ పెదవులపై  మధువుజూచి
తనివితీర తాగాలని తుమ్మెద
సంపంగి ముక్కు జూసి వెళ్ళి పోయె
నా పెదవులకెంత పరితాపమో
నీఅధరసుధామధురసాన్ని గ్రోలాలనీ

నీ మోము కాంతి మెరుపు చూసి
చందమామ సిగ్గుతో మంచు దుప్పటి
తీసి ముఖముపై కప్పుకున్నది
నా కన్నులకెంత ఉబలాటమో
నీకన్నులతో బాసలు చేయాలని

నీ మేని చాయ మెరుపు చూసి
విరబూసిన చిరుచామంతి
సిగ్గుతో ముఖము చాటువేసింది
నా యెడదకు యెంత ఆరాటమో
నీయెద పైన పదిలంగా వాలాలని
తే14/10/12దీ రాత్రి 9.00




Friday 12 October 2012

మురళి// విస్మయము//

చంద్రుని చూస్తే కలువలు వికసిస్తాయి అంటారు

మరి చంద్రునిలోనే కలువలు వికసించాయేమిటి?


నీటి లో చేపలు విహరిస్తూవుంటాయంటారు 

కానీ చేపలలోనే నీరు ఉంది ఎందుకు?


కలువలపై తుమ్మెదలు వాలుతాయంటారు

మరి కలువలే తుమ్మెదలైనాయేమిటీ?


సంపంగి దక్కరకు తుమ్మెదలు రావు అంటారు?

ఐనా సంపంగి ఇరువంకలా తుమ్మెదలున్నాయి!?



చంద్రునిలో చంద్రులు ఉదయిస్తాయా ఎప్పుడైనా?

చంద్రునిలో పలువరుసచంద్రికలు వెన్నెలలు కాసాయి



గిరిశృంగముల పై పయోధరములుంటాయి గానీ

పయోధరముల పై గిరిశృంగములున్నాయేమిటి?


జలధరంబుల దాటి చంద్రబింబముండు కానీ

చంద్రబింబము పైన జలధరంబులున్నవేమి?



ఇట్లు చూపరులకు విస్మయము కల్గునట్లుగా

కనులు,ముఖము,ముక్కు,పలువరుసలు,

కురులు,పయోధరములు అమరియున్నవి.


తే 12/10/12దీ 8.45 రాత్రి

Thursday 11 October 2012


మురళి// పొంగడాల చెట్టు //
 ఒకరోజు పేదరాశి పెద్దమ్మ సోలు ఎండబోసిందట. ఒక అడవి పంది ఆ చోలుని తినబోతే పెద్దమ్మ చేటతో కొట్టిందట. చేటడు వెంట్రుకలు రాలాయాట,వాటిని పులుసులో వేసి కొడుకులకు వడ్డిస్తే వారు అడిగారు."ఈ రోజు పులుసు రుచిగా వుంది, ఏమిటి కలిపావు" అని.పెద్దమ్మ విషయం చెప్పింది.ఐతే ఆఅడవి పందిని వేటాడి పట్టుకొస్తామని బయలుదేరి వెళ్ళారు వారంతా.
     వెళ్ళినవాళ్ళు రెండు రోజులైనా తిరిగిరాకపోయేసరికి చిన్నోడితో చెప్పింది. చిన్నోడు ఒక చురకత్తి పట్టుకు బయలుదేరాడు. అడవిలో వెతకగా వెతకగా పందుల జాడ తెలిసింది. అటుగా వెళ్ళి వాటిని వుల్లగించాడు.ఒక పెద్ద అడవిపంది వీడిపై తిరగబడి మింగేసింది.కడుపు లోపల అన్నలందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు అడిగారు"నువ్వు ఇక్కడికెలాగ వచ్చావు"అని.ఇలగిలగ అనిచెప్పాడు చిన్నోడు.చురకత్తి తీసి పంది కడుపుని కోసుకొని అందరూ బయటపడ్డారు.పందిని ఒక పెద్ద కర్రకు కట్టి ఇంటికి తీసుకు వచ్చారు. పెద్దమ్మ వీళ్ల రాకకు సంతోషించి, వారిని స్నానానికి వెళ్ళమని చెప్పి మాంసం వండింది.మిగిలినది ఊరందరికి పంచింది.కొడుకులు వస్తే వారికి వరుసగా వడ్డించింది. ముందు పెద్దోడు,తరువాత రెందోవాడు అలా...చివరకి చిన్నోడు.అందరూ కొసరి కొసరి వడ్డించుకోగా చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి మాంసం అంతా అయిఫొయింది. ఆఖరుకి ఆ ఇగురులో అన్నం పొరిపి వేసింది చిన్నోడికి. అందరూ ఆవురావురుమని తింటున్నారు.చిన్నోడు "ఒరే పెద్దన్నా పెద్దన్నా ఒక్క సితకియ్యురా" అని,"అబ్బా నేనెందుకిస్తాను" అన్నాడు వాడు."ఒరే రెండన్నా, రెండన్నా చిన్న ముక్కియ్యురా" అంటే వాడూ ఇవ్వలేదు. ఇలా అందరినీ అడిగితే అందరూ "ఇవ్వము" అన్నారు. చివరకు చిన్నన్నను అడిగాడు. వాడు చీకి చీకి ఒక దుమ్ము ఇచ్చాడు. ఆదుమ్ముని సప్పరించుకోని జోబులో దాచుకున్నాడు.
     మర్నాడు ఆవులను మేతకు తోలుకెలుతూ దుమ్ము తీసి చీకుతూ వున్నాడు. అది కాస్తా జారిపోయింది,ఒకపుట్టలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు.అప్పుడన్నాడు"నేను రేపు ఈ యేలకి వొచ్చీసరికి మొక్కవ్వకపోయావో పెద్దన్న గొడ్డలి తో ఒక్కటేసేస్తాను".మరుచటి రోజుకి మొక్కైంది.వచ్చాడు,చూసాడు,మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పొంగడాల చెట్టవ్వక పోనావా చిన్నన్న గొడ్డలితో నరికేస్తాను". మరచటినాటికి చెట్టై పోయింది.మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పువ్వులుపూసి కాయలు కాయకపోయావో నడిపన్న గొడ్డలితోటి అడ్డగ నరికేస్తాను.మరునాటికి కాయలు కాసింది."రేపొచ్చేసరికి పొంగడాలు పండకపోయావో అన్నకొక గొడ్డలి తెచ్చి అన్ని ముక్కలు చేసేస్తాను" అన్నాడు చిన్నోడు.
     ఎప్పుడెప్పుడు తెల్లారుతాదా అని ఎదురుచూసాడు. చివరకు తెల్లారేసరికి, పొంగడాలవాసన వస్తే చెట్టుదగ్గరకి వెళ్ళాడు చిన్నోడు పలకర్ర చేసుకోవడం మరిసిపోయి చెట్టెక్కి పొంగడాలను తెంపుకోని తింటున్నాడు. ఆవాసనకి పెద్దన్న వచ్చాడు,ఒరే చిన్నోడా ఒక్క పొంగడమియ్యురా అంటే "నువ్వు చిన్న సితకియ్యురా అంటే ఇచ్చావేటి? నేనివ్వను" అన్నాడు,"మాతమ్ముడువికదూ ఈసారి ఇస్తాలే" అన్నాడు అన్న.అప్పుడు చిన్న పిసరంత ఇచ్చాడు.అలగే అందరూ వచ్చి అడిగితే అలగే చిన్నపిసర్లు ఇచ్చి పంపించేశాడు. చివరకు చిన్నన్న వచ్చి అడిగితే "ఓరె నీకెందుకివ్వనేస్ చెట్టెక్కురా నీకెన్ని కావాలంటే అన్ని తినురా" అని అన్నాడు. ఇద్దరూ అన్ని పొంగడాలూ తినేశారు.
dt 11/10/12.8.00PM.

Wednesday 10 October 2012


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు(పు)పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ

Tuesday 9 October 2012


స్నేహమనే కొలనిలో
చేపను నేనైతే......
గాలం వేసి గాయం చేస్తావో
గాయం చేసి ప్రాణం తీస్తావో
గాలై వీచి ప్రాణం పోస్తావో!

స్నేహమనే కడలిలో
పడవను నేనైతే.....
సుడివై నడి ముంచుతావో
చుక్కానివై దారి చూపుతావో
తెరచాపవై దరి చేర్చుతావో!

స్నేహమనే తోటలో
పువ్వును నేనైతే....
తుంటరివై త్రుంచెదవో
గొంగలివై మ్రింగెదవో
తుమ్మెదవై మధు గ్రోలెదవో!

స్నేహమనే కొండపై
బండను నేనైతే....
సమ్మెటవై పిండిని చేసెదవో
ఉలివై ప్రతిమను మలిచెదవో
గుడి గుండియలో నిలిపెదవో!

స్నేహమనే వసంతంలో
కోయిల నేనైతే....
బోయవై గొంతు కోసెదవో
మావివై చిగురునిచ్చెదవో
శ్రోతవై గానము మెచ్చెదవో!

Monday 8 October 2012




ఓ వాలుకన్నుల వయ్యారీ
నీ ఓర చూపులు విసరకే

ఓ కొంటె చూపుల కోనంగీ
జుంటి తుమ్మెదలంపకే

ఓ చేపకన్నుల చిన్నారీ
చూపు బాణాల విడువకే

ఓ మొలక నవ్వుల నెలవంకా
మనసు నంతను దోచకే

ఓ లేత బుగ్గల లలితాంగీ
గుండెలలజడి లేపకే

ఓ చురిక చూపుల సంపంగీ
గుండె కోతను కోయకే

ఓ చంద్రకాంతుల చిరుదంతీ
వేడి వెన్నెల విరియకే

ఓ బృకుటికా దనుర్ధారీ
వలపు బాణాలను వేయకే

ఓ నీలి కురులా నీలవేణీ
మరుల వింజామర దాచకే

ఓ చొట్ట బుగ్గల సొగసరీ
బెట్టు ఇంకను మానవే

ఓ మందహాసపు మరుమల్లీ
మదిని మంటలు రేపకే

Thursday 4 October 2012

  ***సితా జననం***
బూమిలో పుట్టింది -వారుద్ర పురుగూ
మేగాన పుట్టింది- అది మెరుపు గన్నె
తమ్ముడా ఇబీషణా- తొందరగా బయలెల్లు
యేటలకె యేల్లాలా- అడవెల్ల తిరగాల
లంక సుట్టూ తిరిగి-లంక వనముల తిరిగి
వనముల్లా తిరిగి- వేటలే ఆడారూ
ఆవనములోపలా- ఎర్రనీ కండా
ఎర్రనీ కండనూ- ఏటలే ఆడారు
మంసమూ ముద్దనూ-మండోద్రి కిచ్చీ
వండవే మండోద్రి - కండనూ వండవే
వండబోయి మండోద్రి- కుండలో బెట్టి
కుండలోన మండోద్రి- కండనే బెట్టే
మూడు రోజుల్నాడు- రావణులె అడిగే
వోలోలె మండోద్రి-వయ్యారి మండోద్రి
మొన్న తెచ్చిన కండా-కూరసెయ్యావే
కుండ మీదన కుండ- మూత జూసేనా
మూత తీసిన కుండా-యెత్తిజూసేనా
మూడురోజుల నాడూ- బాలసినదాయే
బాలలాగా మారి- మెరుపుతీగలాగా మారీ
దీనిజూసి నామొగుడూ-నన్నుమరిసేడూ
కంసాలోడి కాడా-కనకాల పెట్టొకటిజేసీ
బాలాకు తగ్గట్టు- పెట్టొకటి జేసీ
పెట్టిలో బాలాను- బద్రంగా పెట్టి
ఇరిసి కట్లూ గట్టీ- మారు కట్లూ గట్టీ
అలాగ మండోద్రి- బుర్రకెత్తేనా
నట్టేట సంద్రంలో- పెట్టి ఇసిరేనా
జనకులవారేమో-ఏరుబూసేరూ
నాగలీ పట్టుకొనీ- సాలుదున్నేరూ
సాలుకూ ఆపెట్టీ- తగలగా ఆపి
పెట్టెలో ఏముందో- డబ్బు దనముందో
దనముంటె పంచెదనూ-బిడ్డాంటే పెంచెదనూ
బిడ్డనే గాంచీ- ఇడ్డూరమొందీ
ఇంటికీ తీసుకెళ్ళి- ఉయ్యాల్లోవేసె
ఊరంత కదిలిందీ- జోల పాడిందీ



సేకరణ: //మురళీ//*** శ్రీకాకుళం జానపద సాహిత్యం***తే04-10-2012దీ
గ్రంధాలలో దొరకని జానపద సాహిత్యం తరతరాలుగా శృతిస్మృతులుగా పరంపరగా
వస్తున్న జానపద సాహిత్య సంపద యాచకవృత్తి చేసే మాలదాసర్లు,యెరుకలి వాళ్ళు
బుడబుక్కల వాళ్ళు, వొగ్గు కధకులు చెప్పేవాళ్ళూ మొదలైన జానపదులు పాడుకొనే
ఈ గేయాలు నేడు కనుమరుగైపోతూ ఉంటే , ఎక్కడో ఎవరి స్మృతి పదం లోనో మిగిలినవి,
ముఖ్యంగా రామాయణ, భారత ఇతివృత్తాలుగా వున్నవాటిలో కొన్నిమీ ముందుంచుచున్నాను.
***శ్రీరామ జననం***
సిర సాగ్రము పైని -సిద్విలాసుండు
సేసతల్పమూ పైని -పవలించియుండి
అమురులందరితోడా-ఆమునులంతా కూడీ
ఆ రావణూ బాదలకూ- బరియించా లేకా
సీర సంద్రములోన - పడి సావబోగా
అమరులంతా కలిసీ- ఆమునులంతా కలిసీ
ఆదివిష్ణు పాదాలూ- అమరంగా పట్టీ
ఆ విష్ణువావేలా- అబయమొసగేరూ
కరుణించి కమలాచ్చు-కనికరించేరూ
కడుపుణ్యవతియైనా- కౌసల్య గర్భాన
రాముడై జలిమించీ- ఐవోజ్యయందూ
ఆదిశేసువుబుట్టె-లచ్చనామూరితియై
సెంకుసెక్కరాలే-బరత సెత్రికులుగా
అవతారమెత్తేరూ-అవని లోపలనూ
బాలచందురినిలా- దినదినము వుద్దియై
ఆటపాటల తోడ-ఆనందముల తోడ
తల్లిదండ్రులకెల్ల -తనివితీరంగా
కడుబాల్యమందునా- కవుసికిని వెంటా
వనములకె వెళ్ళారూ-విలువిజ్జె నేర్చారూ
మంత్రంబులను నేర్చి- మర్మములను తెలిసి
అకిల విద్దెలనెల్ల- అలవోకగా నేర్చి
యాగమును కాసారూ- రక్కసుల జంపారు
మునులు ఆనందింప- సురలు పువ్వులనొంప

Tuesday 2 October 2012

మురళీ// బెమ్మరాచ్చసి //
    ఒకరోజు తోటలొ పరింపళ్ళు ఏరుతున్న పెద్దమ్మ కూతుర్ని ఎలుగుబంతి ఎత్తుకుపొయింది.ఆవిషయం అఊరి బారికోడు పెద్దమ్మతో చెప్పాడు.పెద్దమ్మ తన పెద్దకొడుకులతో తమ చెల్లిని విడిపించుకురమ్మంచుకురమ్మని చెబితే "అమ్మో మేమేళ్ళము.మమ్మల్ని చంపెస్తాది ఎలుగుబంటి" అని చెప్పి తప్పించుకున్నారు. చిన్నోడుతో చెబితే సరే అని చెప్పి బళ్ళెం పట్టుకు బయలుదేరాడు.అలా వెళుతుండగ చాకిరేవు దగ్గర గడిదలు మేస్తున్నాయి. సూరయ్యనడిగి ఒక గాడిదను అద్దెకు తీసుకున్నాడు. దారిలో ఒక కుమ్మరోడు కుండలు కావిడిలొ వేసుకొని ఎదురైనాడు. వాడి దగ్గర ఒక పెద్ద బాన కొని గాడిదపై పెట్టి వెలుతున్నాడు. అలా వెలుతుంటే ఒక మేదరోడు కనిపిస్తే వాడి వద్ద ఒక పెద్ద చేట కొన్నాడు.కొంత దూరం వెళ్లాక పారలమ్మే కమ్మరోడు ఎదురైతే వాడి దగ్గర ఒక పార కొన్నాడు.అలాకొంతదురం వెళ్ళాక గునపాం(గడ్డపర) లమ్మే వాడు ఎదురైతే ఒక గునపం కొన్నాడు.కొంతదూరం వెళ్ళాక ఒక పడుగులు(పెద్ద లావుపాటి తాడు)అమ్మేవాడు కనిపిస్తే వాడి దగ్గర ఒక పెద్ద పడుగు కొన్నాడు.ఇంకాకొంత దూరం వెళ్ళాక నక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)లు అమ్మే అతను కనిపిస్తే ఒక నక్కు కొనుక్కొని అవన్నీ గాడిదపై వేసుకొని తిన్నగా ఎలుగుబంటి ఒండకు వెళ్ళాడు.
         అక్క చిన్నోడిని పలకరించి "ఎలుగుబంటి చూసిందంటే నిన్ను అమాంతం మింగెస్తది. వెళ్ళి అటక పై దాగో"అన్నది."అయితే వీటన్నిటినీ అటక పైకి తీసుకు వెలతాను" అంటే " అలాగె" అన్నది. ఒక కుంపటి లో నిప్పులు వేసి నక్కును అందులొ పెట్టి విసనకర్రతో విసురుతూ ఎర్రగా కాల్చాడు.ఇంతలో ఎలుగుబంటి వచ్చి అన్నం వడ్డించమన్నది. పెద్దమ్మ కూతురు అన్నం వడ్డిస్తే తింటూ నెయ్యి వెయ్యమంది. అటక పై వున్న నెయ్యిని కుంపటిలో వేసి అందులొ గాడిద మూత్రం ను వేసి కిందికి విసిరేసాడు చిన్నోడు. "మీదను ఎవులున్నారు "అని అంటె పిల్లులు అని సర్దిచెప్పింది అక్క. సరేలే అని మూత్రం ను అన్నంలోకలుపుకొని తింటూ "ఏమిటో ఈరోజు నెయ్యి చాలారుచిగా ఉందని పళ్ళెం నాకేసి మరీ తిన్నాడు. అటక పై మళ్ళీచప్పుడు. మీదికెళ్ళి పిల్లులని తరిమేస్తనుండు అంటే అవే పోతాయిలే అని సర్దిచెప్పింది వీడి అక్క. ఇంతలో మళ్ళి చప్పుడు. "పిల్లి కాదు ఏదో ఉంది అటక పైన బుడ్డీ(దీపం) ముట్టించు చూస్తాను"అంది ఎలుగుబంటి. చిన్నోడు "నేను బెమ్మరాచ్చసుడ్ని నిన్ను మింగేస్తాను "అన్నాడు. అప్పుడు ఎలుగుబంటి"ఐతే నీ పల్లు(దంతాలు) చూపించు అంటే పార చూపించాడు.నీ గోలు చూపించు అంటే గునపం చూపించాడు.నీ చెవులు చూపించు అంటే చేటలు చూపించాడు. నీ కడుపేది అంటే బానను చూపించడు. నీ తోకేది అంటే పడుగు(పెద్ద లావుపాటి తాడు)ను కిందికి వదిలాడు. ఐతే నా అరుపు చూడని బబ్బబ్బ అని గ్ట్ట్గ అరిచింది ఎలుగుబంటి. చిన్నోడు నక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)ను గాడిద పై మోపాడు అంతే గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.ఓరినాయనొ ఇంతపెద్ద బెమ్మరాచ్చసా అంటూ ఎలుగుబంటి భయపడిపొయి పరుగు లంకించుకుంది.చిన్నోడు అక్కను తీసుకొని ఇంటికి క్షేమంగా వచ్చేసాడు.

Monday 1 October 2012

మురళీ//  వరం  //01-10-2012
వెయ్యేళ్ళ తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై
ఏదైనా వరం కోరుకోమంటే ఒక ముని "మరుజన్మలో మళ్ళీ నన్ను
ఈ దేశం లోనే పుట్టించు"అని కోరుకుంటాడు.
అంత సరదా ఏమిటని బ్రహ్మ అడిగితే
"నా దేశం పాడి పంటల నిలయం
అవినీతి మచ్చుకైన కనిపించదు
అన్యాయం అంటే ఏమిటో తెలీదు
అధర్మానికి అస్సలు తావే లేదు
మనిషిని మనిషిగా చూస్తారిక్కడ
బంధాలూ అనుబంధాలు ఉంటాయిక్కడ
పరులసొమ్మును పాములా చూస్తారు
పర స్త్రీని పరాశక్తిగా కొలుస్తారు
పరమత సహనం ఇంకా ఎక్కువ
కులమత భేదాలే కనిపించవిక్కడ
ప్రాంతీయ తత్వం అంటే తెలియదు
భాషా భేదం లేనే లేదు
మత కలహాలే కానగరావు
మతభేదాలే మచ్చుకు లేవు
స్వార్ధపు చింతన చూడగలేము
స్వ ఆర్జన అన్నది చస్తేలేదు
అన్న విక్రయం అసలేలేదు
దానధర్మాలకు కొదువేలేదు
ఇలాంటి దేశం లో పుట్టిస్తే నా జన్మ ధన్యం"
సరే నీఖర్మ అనుభవించు
అంటూ వరమిచ్చి అదృశ్యం అయ్యాడు బ్రహ్మ