Saturday 7 April 2018

శ్రీనాథుని పద్యం
పవిత్ర "మహాశివరాత్రి" పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకునిపార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ "భీమఖండము" లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది.
ముందుగా పద్యాన్ని చిత్తగించండి.
చంద్రబింబాననచంద్రరేఖామౌళి
          
నీలకుంతలభారనీలగళుఁడు ధవళాయతేక్షణధవళాఖిలాంగుండు
          
మదనసంజీవనిమదనహరుఁడు నాగేంద్రనిభయాననాగకుండలధారి
          
భువనమోహనగాత్ర భువనకర్త 
గిరిరాజకన్యకగిరిరాజనిలయుండు
          
సర్వాంగసుందరిసర్వగురుఁడు గౌరిశ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టిచట్టలు పట్టుకొనుచు నందికేశుండు ముందట నడచిరాఁగ నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
        పద్యము సులభగ్రాహ్యంగానే ఉన్నప్పటికీతెలియనివారి కోసం కొద్దిగా వివరిస్తాను. పై సీసపద్యములోని నాలుగుపాదాల్లోనూ పార్వతినిపరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము)మరిశంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో నీల ' అనే పదానికినలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు. 
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.) స్త్రీలను 'గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరిశివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు. 
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువుజగద్గురువు.
        పైవిధంగా ఆ ఆదిదంపతులుతమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.

        మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలాశ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం.

        ఆస్వాదించే అభిరుచిఆసక్తి ఉండాలేగానిమన తెలుగు సాహిత్యములో ఇటువంటి రసగుళికలు ఎన్నో!...........
భవదీయుడు,
సత్యనారాయణ పిస్క.

No comments:

Post a Comment